హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిడికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్మూలనకు చేస్తున్న కృషిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేయడానికి ఆయన బుధవారం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, వైద్యశాఖ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆటాలో తెలంగాణకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి వివిధ రకాలుగా సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కరోనా నిర్మూలనకు తాత్కాలికంగా డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ దవాఖానలకు కావాల్సిన ఆక్సిజన్, ఔషధాలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసిఆర్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన సదుపాయాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా నిర్మూలనలో ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా మన సహాయ, సహకారాలు అందజేస్తామని ఆటా ప్రెసిడెంట్ భువనేష్, జాయింట్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ఆటా బాధ్యులు కొత్త కాశిరెడ్డి, అనిల్ పోశెట్టి, శారద సింగిశెట్టి, సుధీర్ బండారు, మురళి బొమ్మినేని, హనుమంతరెడ్డి, శివకుమార్, రవి, తిరుపతి, లోహిత్ తెలిపారు.
కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధి హనుమంతు, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జనగామ కలెక్టర్ నిఖిల, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్, మహబూబాబాద్ కలెక్టర్ వి.పి.గౌతమ్, నారాయణపేట కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.