హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ చేస్తున్న జాప్యంపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (సౌత్జోన్) ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలలోపు టీవోఆర్ను జారీ చేయాలని సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో యాదా ద్రి థర్మల్ విద్యుత్తు కేంద్ర నిర్మాణం వేగం పుంజుకోనున్నది. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని రూ.34,500 కోట్ల వ్యయంతో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్నది.
2017లోనే నిర్మాణపనులు ప్రారంభంకాగా.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీచేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ముంబైకి చెం దిన కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్ అనే ఎన్జీవో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ఎన్జీటీ.. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను 9 నెలలపాటు సస్పెండ్ చేస్తూ తిరిగి టీవోఆర్ జారీ చేయాలని ఆదేశించింది.
టీవోఆర్ జారీలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో తెలంగాణ జెన్కో తిరిగి ఎన్జీటీని ఆశ్రయించింది. ఆలస్యం కారణంగా నష్టాలు వస్తున్నాయని, నిర్మాణం మరింత భారంగా మారుతున్నదని, వెంటనే టీవోఆర్ను జారీచేసేలా ఆదేశించాలని కోరింది. అదనపు టీవోఆర్ జారీ చేయకుండా కావాలనే జాప్యం చేస్తున్న కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఎన్జీటీ మొట్టికాయలు వేసింది. ఆ మంత్రిత్వశాఖలోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వడ్డీల రూపంలో తెలంగాణ జెన్కోకు తీవ్ర నష్టం కలుగుతున్నదని, రాష్ట్రప్రభుత్వం తమ ప్రాధాన్యం ప్రకా రం వ్యవసాయం కోసం అధిక ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తున్నదని జెన్కో తరఫు న్యాయవాదులు అడ్వొకేట్ జనరల్ జే రాంచందర్రావు, వై రామారావు, వై సంకల్ప్ ఎన్జీటీ ఎదుట వాదించారు.