KCR | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు. దేశంలో రైతుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసిన నాయకుడిని నేనిప్పటివరకు చూడలేదు. అందుకు తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనం. ఎంతో దీక్ష, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు’ అని అంటున్నారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అన్నాసాహెబ్ మానేపాటిల్. తెలంగాణ ప్రగతిని చూసి మురిసిపోతూ, ప్రశంసలతో ముంచెత్తుతున్న ఆయన.. మహారాష్ట్రలో ఇలాంటి ప్రగతి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
తెలంగాణ పర్యటనలో మీరు పరిశీలించిన అంశాలేమిటి?
ఔరంగాబాద్ జిల్లాకు చెందిన నాయకులతో కలిసి తెలంగాణలో చేసిన పర్యటన మధురస్మృతిగా నిలిచిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చూసి అందరం ఆశ్చర్యపోయాం. హైదరాబాద్ నుంచి గోదావరి వరకు దారిపొడవునా ఏ గ్రామం చూసినా పచ్చగా కళకళలాడటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడా ఒక్క ఎకరం భూమి కూడా ఖాళీగా లేదంటేనే వ్యవసాయం ఎంతగా వృద్ధి చెందిందో అర్థమైంది. తెలంగాణ అభివృద్ధి 10వ పేజీలోమాడల్ గురించి కేసీఆర్ మాటల్లో విన్నదానికి, మీడియా ద్వారా తెలుసుకున్నదాని కంటే ఎంతో ప్రగతిని తెలంగాణ సాధిస్తున్నదని అనిపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు కదా ఏం తెలుసుకున్నారు?
ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రాజెక్టు రూపకల్పనే ఒక అద్భుతం. డిజైన్ను యథాతథంగా అత్యంత స్వల్పకాలంలో నిర్మించి ఫలితాలను దాన్ని అనుభవంలోకి తేవటం మరో అద్భుతం. బరాజ్లు, వందల కిలోమీటర్ల కాలువలు, సొరంగాలు, ప్రపంచంలోనే అతి పెద్ద పంపులు.. ఆహా! ఏమిటా నిర్మాణాలు. మహారాష్ట్రలో గోదావరిలో ఎక్కడా నీరు లేదు. కానీ తెలంగాణలో దాదాపు 200 కిలోమీటర్ల మేర గోదావరి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ప్రాజెక్టు గొప్పదనం తెలిసింది. నీరే అన్నింటికీ మూలాధారం. ఆ నీటిని ఒడిసిపడుతున్న తీరే తెలంగాణ ప్రగతి చిహ్నం. కాళేశ్వరం ప్రాజెక్టే ఒక తార్కాణం.
తెలంగాణ అభివృద్ధి మాడల్పై మీ అభిప్రాయం?
100 శాతం వాస్తవికమైంది. అశేష ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది. నిజమైన రైతు పక్షపాతి కేసీఆర్. తెలంగాణది కిసాన్ సర్కార్. ఇక్కడ జరుగుతున్న పనులు, అభివృద్ధిని చూస్తుంటే రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న కృషి కనిపిస్తున్నది. తాగునీరు, సాగునీటికి ఢోకా లేకుండా చేశారు. నీరుంటేనే ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తితోనే ఉపాధి ముడిపడి ఉంటుంది. ఉపాధితోనే వ్యాపారాలు లాభదాయకంగా సాగి ఆర్థిక వృద్ధి నమోదవుతుంది. అందుకు తెలంగాణ నిదర్శనం. 9 ఏండ్లలోనే ఇంత అభివృద్ధి సాధించటం మాటలు కాదు. గట్టి సంకల్పముంటే తప్ప సాధ్యం కాదు.
బీఆర్ఎస్ వచ్చాక మహారాష్ట్ర వాసుల ఆలోచనలెలా ఉన్నాయి?
తెలంగాణ వినూత్న పథకాలు, విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకుసాగుతున్నది. మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. అంతేకాదు తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర వాసులైతే కండ్లారా చూస్తున్నారు. కేసీఆర్ మరాఠ్వాడాకు రాకముందు నుంచే అక్కడ తెలంగాణ ప్రగతిపై మహారాష్ట్ర వాసులు, మేధావులు, రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పింఛన్లు ఇలా అన్నింటి గురించి ఆసక్తితో తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ను అక్కడ ఏర్పాటు చేశాక అది గ్రామగ్రామానికి చేరుతున్నది. తెలంగాణ మాడల్ను ప్రతిఒక్కరు ఆహ్వానిస్తున్నారు.
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు?
మహారాష్ట్రలో రోజుకు 8 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఒక్కటే అక్కడ నెలకొన్న దుష్ట రాజకీయాలు, పాలక ప్రభుత్వాలు అమలుచేస్తున్న పాలసీలే. మహారాష్ట్రలో ఎంతో నీటి సంపద ఉన్నది. అయినా ఇప్పటికీ ట్యాంకర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఇక సాగునీటి పరిస్థితి దేవుడెరుగు. పంటలు పండించినా మార్కెట్లో ధర రాదు. ఇక ఆత్మహత్యలు కాక రైతులు ఏం చేసుకుంటారు?
తెలంగాణ సీఎం కేసీఆర్పై మీ అభిప్రాయం?
మహా మహా నాయకులను చూశా. బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల ప్రభుత్వాలను చూశా. 2013-14లో గుజరాత్ మాడల్ అంటూ బీజేపీ ఊదరగొట్టింది. అది ఎంత డొల్ల అనేది 9 ఏండ్ల పాలనలో తేలిపోయింది. దేశం కోసం వారు చేసిందేమీ లేదు. చేస్తుందన్న ఆశలూ లేవు. కానీ కేసీఆర్ విజన్ చాలా గొప్పది. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారు. మాటలు చెప్పేవాళ్లను చూశా, కానీ మొదటిసారిగా చేతల నాయకుడు కేసీఆర్ను చూశా. తెలంగాణ లాంటి ప్రగతిని, కేసీఆర్ వంటి నాయకత్వాన్నే మహారాష్ట్ర కోరుకుంటున్నది. అందుకే బీఆర్ఎస్కు జై కొడుతున్నది.