TSPSC Paper Leakage | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా అనేక పేపర్ల లీకేజీకి పాల్పడిన వీరు గ్రూప్-1 మెయిన్స్ పేపర్ లీకేజీకి సైతం స్కెచ్ వేసినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో సోమవారం మరో వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రేణుక ఇద్దరితో ఒప్పందం చేసుకోగా, ఆమెకు తెలియకుండా ఆమె భర్త ఢాక్యానాయక్ తిరుపతయ్య అనే కాంట్రాక్టర్ మధ్యవర్తిగా ప్రశాంత్రెడ్డి, రాజేందర్కుమార్కు పేపర్లు విక్రయించాడు. ఈ ఇద్దరిని ఇదివరకే సిట్ అరెస్టు చేసింది. సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, ఢాక్యానాయక్, రాజేందర్ను మూడురోజుల కస్టడీలోకి తీసుకున్న సిట్ సోమవారం రెండోరోజు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
రేణుక భర్త ఢాక్యానాయక్, ఆమె సోదరుడు రాజేశ్వర్ మరో స్కెచ్ వేశారు. రేణుకకు తెలియకుండా ఏఈ ప్రశ్నపత్రాన్ని తీసుకున్నారు. దానిని మార్కెట్లో విక్రయించి భారీగా డబ్బు సంపాదించాలని ప్లాన్చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్గా పనిచేసే తిరుపతయ్య ద్వారా ప్రశాంత్రెడ్డి, రాజేందర్కుమార్ను సంప్రదించి రూ.17.5 లక్షలకు ఒప్పందం చేసుకొన్నారు. కర్మన్ఘాట్లోని ఓలాడ్జికి రప్పించుకొని ప్రశ్నపత్రాలను అప్పగించారు. తొలుత చెప్పినట్టుగా కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ తాము దొంగిలించలేదని, హ్యాక్ చేసి పాస్వర్డ్ సేకరించినట్టు రాజశేఖర్ వెల్లడించా డు. ఆ పాస్వర్డ్తో ప్రవీణ్ సిస్టం వద్ద నుంచి కస్టోడియన్ సిస్టమ్ ఓపెన్ చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. బడంగ్పేట్, మల్లికార్జున కాలనీలో ఉన్న ప్రవీణ్కుమార్ ఇంట్లో సోమవారం అధికారులు సోదాలు చేయడంతో రూ.4 లక్షల నగదు లభించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్లో వంద మార్కులు దాటిన 121 మందిని సిట్ గుర్తించి 60 మందిని విచారించింది.
పేపర్ లీకేజీ ఘటనపై సిట్ అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నది. రెండోసారి కస్టడీలోకి తీసుకున్న నిందితుల విచారణ మంగళవారంతో ముగియనున్నది. లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్-1 పరీక్ష రాసి, అరెస్టయిన సురేశ్, రమేశ్, షమీమ్ను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై మంగళవారం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో అరెస్టయి న ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యనూ కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులు, పరీక్ష రాసిన వారికి ఉన్న సంబంధాలను గుర్తించడానికి కాంటాక్టులు మ్యాపింగ్చేస్తూ ఆయా లింక్లను వెలుగులోకి తెస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి సక్సెస్ అయిన ప్రవీణ్, రాజశేఖర్ ఏఈ ప్రశ్నపత్రం ద్వారా బాగా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేశారు. ఏఈ ప్రశ్నపత్రాన్ని రేణుకకు అప్పగించి రూ.10 లక్షలు తీసుకున్నారు. ‘మేము గ్రూప్స్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రిలిమ్స్ లీక్ చేసి సక్సెస్ అయ్యాం. మెయిన్స్పై కూడా ఎంతో నమ్మకం ఉన్నది. ఆ పేపర్ను కూడా సంపాదిస్తాం. మాతోపాటు మా వాళ్లు గ్రూప్స్ కొడితే ఉన్నత పదవుల్లో ఉంటారు. మెయిన్స్ రాయాల్సి ఉన్నదనే విషయం గుర్తించుకో. ఎవరికైనా తెలిస్తే అందరం దొరికిపోతాం. ఉన్న ఉద్యోగాలు ఊడుతాయ్..’ అని రేణుకకు జాగ్రత్తలు చెప్పినట్టు తెలిసింది. ఆమె ప్రవీణ్, రాజశేఖర్కు ఇచ్చిన మాట ప్రకారం నీలేశ్, గోపాల్కు పేపర్ను విక్రయించి, వారిద్దరిని మహబూబ్నగర్లో పరీక్షకు సిద్ధంచేసి పరీక్ష హాల్కు తీసుకొచ్చింది.