హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధతపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గరిష్ఠంగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై వక్రభాష్యాలు మొదలవుతాయని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పొస్టులను కూడా ఒక అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దశలవారీగా ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అదనంగా దాదాపు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా వీటిని వినియోగించుకోవాలని నాయకత్వం ఆలోచిస్తున్నది. ఆశావహులు ఎవరెవరు ఉన్నారు? గతంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన పదవులు ఇవ్వాలి? వంటివి చర్చించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రాష్ట్రంలో ఏయే పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నది, ఆయా చోట్ల ఏ సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది? వంటి కుల, మత సమీకరణల ఆధారంగా పోస్టులు ఇవ్వడంపై పీఏసీలో చర్చించనున్నట్టు సమాచారం.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కో ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతను ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసంతృప్తులను బుజ్జిగించేందుకు, కీలక నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు నామినేటెడ్ పోస్టులను ఆశ చూపించారు. ఇప్పుడు ఆయా నేతలను సంతృప్తిపరచాల్సిన సమయం వచ్చింది. ఇది కాస్త ఇబ్బందికర పరిణామమని నేతలు చెప్పుకుంటున్నారు. సీనియర్లు ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇవ్వకుంటే వారు కినుక వహించే అవకాశం ఉన్నదని, అదే జరిగితే లోక్సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని చెప్తున్నారు. మరోవైపు, హామీ మేరకు పదవులు ఇచ్చుకుంటూ పోతే సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉన్నదని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.