హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మాణిక్రావ్ ఠాక్రేను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన విడుదల చేశారు. ఠాగూర్పై వేటు ద్వారా అధిష్ఠానం రేవంత్రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిందనే ప్రచారం జరుగుతున్నది. ఠాగూర్పై వేటు వేయడమంటే రేవంత్రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టడమేనని పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం చెప్తున్నది. ఠాగూర్ అండ చూసుకొని ఇన్నాళ్లు రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఇటీవల పార్టీలో సీనియర్లు, వలస నేతల మధ్య తలెత్తిన రచ్చను పరిష్కరించేందుకు రాష్ర్టానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నివేదిక ఆధారంగా ఠాగూర్పై చర్యలు తీసుకొన్నట్టు తెలిసింది.
ఠాగూర్పై వేటుతో కాంగ్రెస్లో సీనియర్ నేతలు పంతం నెగ్గించుకొన్నారని ప్రచారం జరుగుతున్నది. వలస నేతలతో పోరులో పైచేయి సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ పార్టీలోని మెజారిటీ నేతలు మాణిక్కం ఠాగూర్ను వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షడు రేవంత్రెడ్డి, మాణిక్కం ఠాగూర్ల బంధంపై సీనియర్లు సీరియస్గా ఉన్నారు. ఇద్దరు కలిసి పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారని, సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్రలు చేస్తున్నారని కొందరు బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రచ్చకు ముగింపు పలికేందుకు దిగ్విజయ్ సింగ్కు సీనియర్ నేతలంతా మాణిక్కం ఠాగూర్పై ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. దీంతోపాటు వీలైతే రేవంత్రెడ్డిని కూడా టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్టు తెలిసింది. సీనియర్ల అభిప్రాయాలతో దిగ్విజయ్సింగ్ అధిష్ఠానానికి నివేదిక అందించారు. దాని ఆధారంగానే తొలుత ఠాగూర్పై వేటు వేసినట్టు పార్టీలో చెప్పుకొంటున్నారు. తర్వాతి వేటు రేవంత్రెడ్డిపైనే అని అంటున్నారు. రేవంత్రెడ్డి అందరినీ కలుపుకొని వెళితే సరి.. లేనిపక్షంలో ఆయనపై కూడా వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.