బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు ప్రస్తుతం డైలమాలో పడినట్టు తెలిసింది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తారా? లేదా? అనేది సందిగ్ధంగా మారడంతోపాటు, మున్ముందు మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంటని పునరాలోచనలో పడినట్టు సమాచారం. అంతేకాదు, రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ రంగాల్లోనూ అమలు చేయాల్సి ఉంటుందని, ఒకచోట అమలు చేసి, మరోచోట అటకెక్కిస్తే అసలుకే ఎసరు వస్తుందనే భావనతో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది.
హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ): బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాక ఎదురయ్యే పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తున్నది. బీసీ కోటాపై ఒకవేళ న్యాయవివాదాలు తలెత్తితే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే విషయమై న్యాయనిపుణులు, బీసీ సంఘాల నేతలతోనూ ప్రభుత్వ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఆ గణాంకాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా ఆ మేరకు రిజర్వేషన్లను పెంచింది.
అసెంబ్లీ సమావేశాల్లో 2 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించినా, ప్రస్తుతం అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లులను పక్కనపెట్టి పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లకు సంబంధించి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ తర్వాత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకూ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. వాటిల్లో మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.
అలా చేయాలంటే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. లేదంటే వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి.. రిజర్వేషన్లపై నివేదికను అందించాలని డెడికేటెడ్ కమిషన్ను సర్కారు కోరినట్టు తెలిసింది. స్థానిక సంస్థల్లో అమలు చేశాక విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించి డిమాండ్ ఊపందుకుంటుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేవలం పంచాయతీలో మాత్రమే అమలు చేసి ఇతర వాటిల్లో అమలు చేయకపోతే మళ్లీ వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుందని, రాజకీయంగా బద్నాం కావాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దల వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ను జారీ చేయడానికే ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ ఆమోదించినా, లేకున్నా రెండు విధాలుగా మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆమోదిస్తే ఎవరూ కోర్టుకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించి బీసీ వర్గాల మెప్పు పొందవచ్చని భావిస్తున్నది. ఒకవేళ గవర్నర్ ఆమోదించకుంటే బీఆర్ఎస్, బీజేపీని బద్నాం చేయవచ్చని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు హామీనిచ్చి వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
రిజర్వేషన్లపై మళ్లీ నివేదికలు తెప్పించుకోవడం ద్వారా మరింత జాప్యమవుతుందని, ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును ముందు పెట్టి, పార్టీ పరమైన రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియను ముగించాలనే దిశగానూ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల ముందు డిమాండ్ పెట్టవచ్చని, ఈ రకంగా కూడా లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. 42 శాతం రిజర్వేషన్ హామీ నుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని కూడా అనుకుంటున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని, పార్టీ పరంగానూ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే, వ్యవసాయ సీజన్ ముగియకముందే ఎన్నికలను పూర్తిచేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ముందుకు పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.