హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి ఫలాలు అందేలా చొరవ చూపే జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు అరకొర హామీలను నెరవేర్చకపోవడం జర్నలిస్టుల సంక్షేమం కాగితాలకే పరిమితమవుతున్నది. జర్నలిస్టుల సంక్షే మ నిధి, ఆరోగ్యభద్రత, అక్రెడిటేషన్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాల హామీల అమలుపై కార్యాచరణ చేపట్టకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రూ.100 కోట్ల సంక్షేమ నిధిని సాధించాలని డిమాండ్ చేస్తున్నారు.
హామీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ జర్నలిస్టులనూ మోసం చేసింది. మ్యానిఫెస్టోలో ఇచ్చింది ఐదు హామీలే.. అయినా వాటిలో ఒక్క హామీని నెరవేర్చలేదు. రూ.100 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటుచేస్తామని ఇంత వరకు నయాపైసా జమచేయలేదు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. ఉద్యోగులతో సమానంగా హెల్త్కార్డులివ్వాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం ఉద్యోగులకు మాత్రమే హెల్త్కార్డులిస్తున్నది. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన కార్డులతోనే జర్నలిస్టులకు వైద్యం అందుతున్నది. సంక్షేమ నిధి కేటాయించి ఉంటే.. ఇప్పుడున్న రూ.2కోట్లకు రూ.5కోట్లు వడ్డీగా సమకూరేది. ఈ మొత్తం రూ.7 కోట్లకు చేరేది. వీటితో వందలాది మంది నిరుపేద జర్నలిస్టులను ఆదుకొనే అవకాశముండేది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఈ రెండున్నరేండ్లలో రూ.100 కోట్ల కార్పస్ ఫండ్తో పాటు, రూ.12 కోట్ల వడ్డీని నష్టపోయారు. ఇప్పటికీ గత కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేసిన జర్నలిస్టు సంక్షేమ నిధి ద్వారా ఏడాదికి రూ.2కోట్లు సమకూరుతున్నది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలకు రూ.3వేల పింఛన్ ఇస్తున్నారు.
అర్హులైన జర్నలిస్టులకు జిల్లాలవారీగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో సభ పెట్టి సీఎం రేవంత్రెడ్డి జేఎన్ సొసైటీకి భూమి హక్కుపత్రాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నిజాంపేట, పేట్బషీరాబాద్లో స్థలాలు ఇవ్వలేమని చేతులు దులుపుకొన్నారు. ఫ్యూచర్సిటీలో 500 ఎకరాలిస్తామని ప్రకటించారు. ఫ్యూచర్సిటీలో స్థలాలిచ్చేందుకు అనుసరించే పాలసీనే.. జేఎన్ సొసైటీ విషయంలో ఎందుకు వర్తించదని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాపాలన.. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆధార్కార్డుకు ఉన్న విలువ అక్రెడిటేషన్లు, మీడియా సంస్థలిచ్చిన గుర్తింపుకార్డులకు లేకపోవడం శోచనీయం. ఆధార్కార్డు చూపిస్తే సచివాలయంలోకి ఎంట్రీ పాస్ జారీచేస్తున్న సర్కార్.. జర్నలిస్టు గుర్తింపుకార్డు చూపిస్తే మాత్రం నో ఎంట్రీ అంటున్నది. ప్రభుత్వమిచ్చిన గుర్తింపు కార్డు చూపిస్తే సచివాలయ భద్రతా సిబ్బంది అనుమతించడంలేదు. పాస్ ఉంటేనే ఎంట్రీ ఇస్తామంటున్నారు. ఇలా ప్రతిరోజూ అవమానం జరుగుతుండటంతో జర్నలిస్టులు కుమిలిపోతున్నారు.
జర్నలిస్టు సంక్షేమ పథకాలకు కేసీఆర్ సర్కార్ హయాంలోనే అంకురార్పణ జరిగింది. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదే రూ.42కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి(కార్పస్ ఫండ్)ను ఏర్పాటుచేసింది. వాటిలో నుంచి రూ.17.61కోట్లు జర్నలిస్టు సంక్షేమం కోసం అకాడమీ ఖర్చుచేసింది. హైదరాబాద్ నాంపల్లిలో రూ.15 కోట్లతో అన్ని హంగులతో మీడియా అకాడమీ భవనాన్ని నిర్మించింది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు 12వేల అక్రెడిటేషన్లు మాత్రమే ఉండేవి. కేసీఆర్ సర్కార్ 22వేల అక్రెడిటేషన్ కార్డులిచ్చింది. తొలిసారి డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు అందించింది బీఆర్ఎస్ సర్కారే. అంతేగాక 33శాతం మహిళా రిజర్వేషన్లను అమలుచేసింది. సామాజిక భద్రతా పథకం కింద రూ.5లక్షల ప్రమాద బీమాను కల్పించింది. 2022 నాటికే 20వేల మంది జర్నలిస్టులు ఈ బీమాను పొందారు.