Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రజోపయోగ నిర్ణయాలను వేగంగా తీసుకొని, అమలుచేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి, సంప్రదింపుల పేరుతో నెలలపాటు నెట్టుకొస్తున్నది. నేరుగా నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు. ఒక్కో మంత్రి నాలుగైదు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు, మంత్రుల పేషీల్లోని అధికారులు ఏ సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియక తికమకపడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, కమిటీల సమావేశాలు ఏర్పాటు చేయటానికి జీఏడీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పోనీ ఈ కమిటీలతో ఇప్పటివరకు ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరికిందా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానమే వస్తున్నది. దీంతో క్యాబినెట్ సబ్కమిటీల చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా క్యాబినెట్ సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు దాని అమలుపై దృష్టిసారిస్తారు. విధివిధానాలు రూపొందించుకొని, సీఎం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా అమలు చేస్తుంటారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా మళ్లీ సబ్ కమిటీ వేస్తున్నారు. దీంతో ముందుగా అధికారులు వివరాలు సేకరించి, సదరు మంత్రితో చర్చించి, ఆ అంశాలను క్యాబినెట్ సబ్కమిటీ ముందు ఉంచాల్సి వస్తున్నది. కమిటీ కొన్నిసార్లు సమావేశమై చర్చించి, నిర్ణయం తీసుకొని, సీఎం వద్దకు ఫైల్ పంపుతున్నది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.
9 నెలల కిందట ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వేసిన కమిటీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న అంశాలపై కూడా ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన దాఖలాలు కనిపించటం లేదు. ఉదాహరణకు 2008 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటికే అమలవుతున్న విధానాన్ని పరిశీలించి, విధివిధానాలు ఖరారు చేయాలని సబ్కమిటీని ఏర్పాటుచేశారు. ఇప్పటికే విద్యాశాఖ వద్ద సంపూర్ణంగా వివరాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి నెల రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా.. 6 నెలలుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు.
విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సబ్కమిటీ ఏర్పాటైంది. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఇందులో సభ్యులుగా ఉన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఈ కమిటీ ఏం పనిచేస్తున్నదో తెలియని పరిస్థితి.
ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. వీటి అమలుకు ఈ ఏడాది జనవరి 8న క్యాబినెట్ సబ్కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. చివరిసారిగా ఫిబ్రవరి 1న సీఎంతో కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత కమిటీ ఊసే లేదు. కమిటీ కొనసాగుతున్నదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. ఒకవేళ ఉంటే ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు, అర్హులందరికీ అందుతున్నాయా? లేవా? కొత్త దరఖాస్తుల ప్రక్రియ వంటి అంశాలపై ఎందుకు రివ్యూ చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జీవో 317, జీవో 46 అమలుపై మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో ఒక కమిటీని ఫిబ్రవరిలో నియమించింది. కమిటీ ఇప్పటివరకు అనేకసార్లు భేటీ అయ్యిం ది. చర్చల మీద చర్చలు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు. దీంతో ఉద్యోగుల ఉసూరుమంటున్నారు.
డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఉద్యోగాల్లో చేరబోతున్నామని అభ్యర్థులు భావించగా ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. జీవో 317, 46పై ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీకే విధివిధానాల ఖరారు బాధ్యత అప్పగించింది. అప్పటి నుంచి విద్యాశాఖ అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉన్నా.. సబ్కమిటీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప ఈ విషయాన్ని తేల్చటం లేదు. మరోవైపు ఉద్యోగాలు ఇచ్చే అంశం ఏమైందని పదేపదే న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ను అడుగుతున్నా, సాగదీత ధోరణి కనిపిస్తున్నది. చివరగా ఈనెల 27లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని ఏజీ గడువు తీసుకున్నారు. ఆలోగానైనా పూర్తి చేస్తుందా? అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
రైతు భరోసా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో సబ్కమిటీని జూలైలో ప్రభుత్వం నియమించింది. 15 రోజుల్లోగా ఆ సబ్కమిటీ నివేదిక ఇస్తుందని సర్కారు తెలిపింది. ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి, అమలు చేస్తామని సర్కారు పెద్దలు ప్రకటించారు. మంత్రులు కూడా హడావుడిగా జిల్లాల పర్యటనలు, వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత దాని ఊసే లేకపోయింది. రైతు రుణమాఫీని ప్రచారం చేసుకొని, ఈ సీజన్ రైతుభరోసా వేయకుండా ఎగ్గొట్టింది.
షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇందులో మంత్రులు దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సమావేశాల ఊసే లేదు. తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం తుదిరూపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతుందని అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పటివరకు తేల్చిందేమీ లేదు. ఇలా ప్రభుత్వం వేసిన కొన్ని సబ్కమిటీలు అసలు ఊసులోనే లేవు. కొత్త రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి, జల వనరుల రక్షణకు.. ఇలా ఇబ్బుడిముబ్బుడిగా సబ్కమిటీలను నియమించింది.
కొన్ని కమిటీలు సమాశాలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇలా క్యాబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలయాపన తప్ప… సమస్య పరిషారం కావటం లేదని అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘సమగ్రంగా సంప్రదింపులు జరుపుతున్నాం’ అనే వంకతో నెలలపాటు సమయం వృథా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక్కో మంత్రికి నాలుగైదు కమిటీల్లో చోటు కల్పించటంతో.. వారికి కూడా పనిఒత్తిడి పెరిగిందని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కమిటీలను వేగవంతం చేసి తుది నివేదికలు తెప్పించుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో అత్యంత కీలకమైన అంశాలపై తప్ప మంత్రులతో కమిటీలు వేయొద్దని, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంటున్నారు.