చిట్యాల (మొగుళ్లపల్లి), మార్చి 28 : ‘కాంగ్రెస్ దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెకింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై రైతన్న పొట్టకొడుతున్నది’ అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. సాగునీరందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామ శివారులో సాగునీరందక ఎండిపోయిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిరికొండ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఎకరం ఎండిపోకుండా నీరందించినట్టు కొనియాడారు. కానీ, కాంగ్రెస్ మూడు నెలల పాలనలో రైతులకు ముప్పుతిప్పలు తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగానికి యాసంగి పంటలకు నీరందించే సోయి లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.