హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర. తరతరాలుగా మన కొలువులను కొల్లగొట్టిన తీరుకు కేసీఆర్ సర్కారు శాశ్వతంగా చరమగీతం పాడింది. మన కొలువులు మన బిడ్డలే దక్కించుకునేలా ఎన్నో సంస్కరణలు, మార్పులు చేసింది. పదేండ్లల్లో పటిష్టమైన విధానాలను రూపొందించి తెలంగాణ బిడ్డలకే కొలువులు దక్కేలా చేసింది.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సర్కారు కొలువులన్నీ తెలంగాణ బిడ్డలకే దక్కాలి..! ఈ గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కారు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. కేవలం ఉద్యోగాల భర్తీకే పరిమితం కాలేదు.. అన్యాయాలు, అసమానతలు రూపుమాపే యజ్ఞానికీ శ్రీకారం చుట్టింది.
కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి 95 శాతం ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కేలా కృషి చేసింది. ఫలితంగా నేడు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకే అభ్యర్థి మూడు, నాలుగు ఉద్యోగాలు సాధిస్తున్నారు. పారదర్శకత, ప్రతిభకు పెద్దపీట వేయటమే ఇందుకు కారణం. పదేండ్ల కాలంలో గతం తాలూకు అన్యాయాలు లేవు. అసమానతలు అసలే లేవు.
2.24 లక్షల ఉద్యోగాల భర్తీ
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో మొత్తం 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసింది. 2014-22 మధ్య 1.33లక్షల ఉద్యోగాలను నింపి చరిత్ర సృష్టించింది. 2023లో ఏకంగా 80,039 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.
పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 27,305 పోస్టులు భర్తీ చేయగా, తాజాగా 17,516 పోస్టులను భర్తీ చేస్తున్నారు. గురుకుల రిక్రూట్మెంట్బోర్డు ద్వారా 11,715 పోస్టులు భర్తీచేయగా, ప్రస్తుతం 12,150 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.ఉద్యోగార్థుల వయోపరిమితిపై ప్రభుత్వం పదేండ్ల సడలింపునిచ్చింది. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తూ, భోజన వసతి కూడా కల్పిస్తున్నది. బీసీ స్టడీ సరిళ్లలో కూడా శిక్షణలను కొనసాగించింది.
జోనల్ వ్యవస్థ జీవనాడి
ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులను అప్పటి ప్రభుత్వాలు యథేచ్ఛగా ఉల్లంఘించాయి. జిల్లా, జోనల్ పోస్టుల్లో 20, 30, 40 శాతం పోస్టుల భర్తీలో నాన్లోకల్ కోటాను అమలుచేశాయి. 80- 60శాతం ఉద్యోగాల్లోనే స్థానికులకు అవకాశమిచ్చాయి. పరీక్షలు, ఇంటర్వ్యూల్లోనూ అన్యాయమే జరిగేది.
అస్తవ్యవస్థంగా ఉన్న ఈ జోనల్ విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం ముందుగా సంస్కరించింది. కొత్త జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడే కేసీఆర్ సర్కారు దూరదృష్టితో వ్యవహరించింది. అటెండర్ నుంచి ఆర్డీవో ఉద్యోగాల దాకా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా నిబంధనలను సవరించింది. దీంతో తెలంగాణేతరులు మన రాష్ట్రంలోని ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకు పటిష్ట విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కార్పొరేషన్లలోనూ స్థానిక కోటా
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో గతంలో స్థానిక కోటా అమలయ్యేది కాదు. ఆయా ఉద్యోగాలను ప్రాంతేతరులే కొల్లగొట్టారు. వీటిల్లోనూ స్థానిక కోటా అమలుచేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణ యం తీసుకొన్నది. దీంతో రాష్ట్రంలోని బేవరేజెస్, సివిల్ సప్లయిస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, గిడ్డంగుల సంస్థ వంటి కార్పొరేషన్లు, సొసైటీలుగా కొనసాగుతున్న తెలంగాణ ఎస్సీ, మైనార్టీ, బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 95% రిజర్వేషన్లు దక్కుతున్నాయి.
ఇంటర్వ్యూలు రద్దు
అన్యాయాలు, అసమానతలకు తార్కాణం గా ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని కేసీఆర్ సర్కా రు ఎత్తివేసింది. గ్రూప్స్ సహా పలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను రద్దుచేసింది.
95 శాతం లోకల్ రిజర్వేషన్ ఉన్న రాష్ట్రం
గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, తదితర గ్రూప్ -1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చాయి. వీటిల్లో 95% ఉద్యోగాలు మనవాళ్లకే దక్కుతున్నాయి. టెండర్ నుంచి ఆర్డీవో దాకా 95 శాతం లోకల్ రిజర్వేషన్ను అమలుచేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.
క్రమబద్ధీకరణ ఫలాలు:
2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. 5,544 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. దీంట్లో 3,897 మంది విద్యాశాఖకు చెందినవారే. వీరిలో అత్యధికంగా 2,909 మంది జేఎల్ వారు ఉన్నారు. వీరితో పాటు 184 మంది జేఎల్ (వొకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డీఎల్, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, 179 మంది ఎల్టీ వారు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణాధికారులు ఉన్నారు. 20,555 మంది వీఆర్ఏలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు.
ఎంప్లాయీఫ్రెండ్లీ సర్కారు
రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్/గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ 2014లో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’ పేరుతో ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించింది. గత ఏడేండ్లలో రెండుసార్లు వేతన సవరణ జరిగింది. 2015లో 43%, 2020లో 30% ఫిట్మెంట్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేతనాల పెంపుతో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యుత్తమ జీతాలు పొందుతున్నవారిగా నిలిచారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా 2020లో పీఆర్సీని ప్రకటించింది.
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్
‘జాబ్ క్యాలెండర్.. ఏడాదికి ఒకసారి గ్రూప్-1, ఏడాదికి రెండుసార్లు గ్రూప్ 2, 3,4 నిర్వహిస్తాం. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ..’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ను కూడా విడుదల చేయలేదు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసింది. జాబ్ క్యాలెండర్ పత్తాలేకుండా పోయింది.
ఏప్రిల్ 1న ఇస్తామన్న నోటిఫికేషన్తో ఏప్రిల్ ఫూల్ చేసింది. పైగా కేసీఆర్ సర్కారు పరీక్షలు నిర్వహించగా, రేవంత్ ప్రభుత్వం ఫలితాలు ప్రకటించి, నియామక పత్రాలిచ్చి వాటిని తామే భర్తీచేశామని క్రెడిట్ కొట్టేందుకు తాపత్రయపడుతున్నది. పాతవి రద్దుచేసి తమ ఖాతాలో వేసుకొన్నది. గత కేసీఆర్ సర్కారు 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసి మరో 60 పోస్టులను కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 5,089 పోస్టుల భర్తీకి జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దుచేసి, అదనంగా 5,973 పోస్టులు కలిపి కొత్తగా 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు తమ ఖాతాలో వేసుకొన్నది.
నిరుద్యోగుల నుంచి ఒక్క రూపాయి ఫీజు తీసుకోబోమని, టెట్ ఫీజును రూ.వెయ్యికి పెంచింది. గ్రూప్ 1, డీఎస్సీ సహా అన్ని పోస్టుల భర్తీకి ఎక్కడాలేని ఫీజులను వసూలు చేస్తున్నది. అంతేకాకుండా ఉద్యోగులను దారుణంగా మోసగించింది. పెండింగ్ డీఏలను విడుదల చేయయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులను ఉత్తచేతులతో ఇంటికి పంపిస్తున్నది. హెల్త్కార్డులు పత్తాలేకుండా పోయాయి. పెండింగ్ బిల్లులు ఆర్థికశాఖ వద్దే మూలుగుతున్నాయి.
తెలంగాణ బిడ్డలకే అవకాశాలు