హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వెనకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు ముడిసరుకులు, యంత్రపరికరాల కొనుగోలుకు 100 శాతం సబ్సిడీతో రూ.1 లక్ష ఆర్థికసాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని నిలుపుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీబంధు పథకం కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1 లక్ష ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసింది. పనిముట్ల కొనుగోలు, లేదంటే ఆధునీకరణ, ముడిసరుకుల కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించింది. అందుకోసం దరఖాస్తులను స్వీకరించగా, 5,28,862 మంది దరఖాస్తు చేసుకొన్నారు.
బీసీ ఏ సామాజికవర్గం నుంచి 2,66,001, బీసీ బీ నుంచి 1,85,136, బీసీ డీ నుంచి 65,310, ఎంబీసీల నుంచి 12,415 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం 4.13 లక్షల మందికిపైగా అర్హులను గుర్తించారు. వారందరికీ ప్రతి నెలా 15వ తేదీన ఆర్థికసాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతను జూలై 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించింది. ఎన్నికల ముందు వరకు దాదాపు 40 వేల మందికి బీసీబంధు అందించింది. ఇంకా 3.60 లక్షల మంది అర్హులున్నారు. తాజాగా ఆ పథకాన్నే నిలుపుదల చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.