హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిన్న మొన్న టివరకూ రైతే రాజు. పదేండ్లలో పెరిగిన సాగునీటి లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహం తో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే కల్లాల వద్దకు వచ్చి పంటకు కాంటా వేయడంతో రైతులు కూర్చున్న చోటే రాజుల్లా పైసలు లెక్కబెట్టుకున్నా రు. కానీ గత మూడు నెలల్లో వారి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. భూ యజమానులుగా ఉన్న రైతుల పరిస్థితు లే ఇలా ఉంటే.. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సాగునీటి కొర త ఒకవైపు,అకాల వర్షాలు మరో వైపు పంటను ధ్వంసం చేశాయి. దీంతో 20 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.పెట్టుబడి కోసం చేసిన అప్పు వారికి నిద్రలేని రాత్రులను తెచ్చిపెడుతున్నది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయం చేసే వారికందరికీ రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తామని హామీనివ్వడంతో కౌలురైతులు సంతోషించా రు. కానీ నాలుగు నెలలు దాటుతున్నా రైతు భరోసాపై అతీగతీ లేదు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు శంకర్ పది ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి రూ.20వేల చొప్పున చెల్లిస్తానని భూయజమానితో ఒప్పందం చేసుకున్నాడు. నిరుడు లాభాలు బాగానే ఉండటంతో ఈ సారి వరి వేశాడు. ఇందుకోసం ఎకరానికి రూ.40వేల పెట్టుబడి పెట్టాడు. కానీ కావాల్సినంత సాగునీరు సరఫరా లేకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో శంకర్ పూర్తిగా నష్టపోయాడు. ఓ వైపు పెట్టుబడి నష్టపోగా.. మరోవైపు భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుబడే లేని పరిస్థితిలో కౌలు ఎలా చెల్లించగలనని శంకర్ బావురుమంటున్నాడు.
జూబిలీనగర్కు చెందిన ఎం రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇదే. 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని, రైతు భరోసా వస్తుందన్న నమ్మకంతో సాగు మొదలుపెట్టానని చెప్పాడు. రైతు భరోసా సంగతేమోగానీ ఈ ప్రభుత్వం సాగునీటిని కూడా అందించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాష్ట్రంలో విస్తారంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఈ యాసంగిలో భూములను కౌలుకు తీసుకొని సాగు మొదలు పెట్టారు. భూమి నాణ్యత, వచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరానికి రూ.15వేల నుంచి రూ.25వేల వరకూ భూయజమానికి చెల్లించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ సాగునీటి ఎద్దడి కారణంగా సుమారు 15 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా ఎండిపోయినట్టు తెలుస్తున్నది. దీంతో చేసిన కష్టానికి లాభాలు వచ్చుడేమో గానీ కనీసం కౌలు చెల్లించేంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కే రవి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయినా కౌలు రైతులను గుర్తించేందుకు గానీ, వారికి ఆర్థిక సాయం చేసేందుకు గానీ ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విమర్శించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు పలు ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గత నెలలోనే ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించామని చెప్పారు. కానీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కోడ్ ఎత్తివేసేలోగా రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ముగిసిపోతుందని, కౌలు రైతులు బజారున పడే పరిస్థితి నెలకొంటుందని అన్నారు.