హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎ న్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. 62 వేల పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నదని, వాస్తవానికి ఇచ్చింది 16 వేలేనని పేర్కొన్నారు. మిగతావన్నీ గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టీ జ్యోతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కేంద్రంలో 60 లక్షలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. పోలీస్ ఉద్యోగార్థుల డిమాండ్ మేరకు తక్షణమే 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి’ అని డిమాం డ్ చేశారు. నిరుద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న మహాధర్నా నిర్వహించనున్నట్టు జాన్వెస్లీ, రంగారెడ్డి వెల్లడించారు. గుడిసెలు వేసుకున్న పేదలకు 120 గజాల చొప్పున స్థలమిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని డిమాం డ్ చేస్తూ 6న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకు తరలిరావాలని కోరారు.