మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఆర్ఆర్ గ్రాంటు కింద రూ.50 లక్షల అంచనా వ్యయంతో గుర్తూరు చెక్ డ్యాం, కోటి రూపాయల అంచనా వ్యయంతో గుర్తూరు బిటి రోడ్డు నుంచి సాధు నాయక్ తండా వరకు రోడ్డుకు, ఎంఆర్ ఆర్ గ్రాంట్ కింద రూ.12 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో కంఠాయపాలెం, మడిపల్లి, ఫతేపురం, సాధు నాయక్ తండా, దుబ్బ తండాలలో రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపనలు చేశారు.
అలాగే రూ.4కోట్ల 64 లక్షలతో నాబార్డు గ్రాంట్ తో నిర్మించిన చెక్ డ్యాం, కోటీ 20 లక్షలతో ఉపాధి హామీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, రూ.12 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి అదనపు గదులు, రూ.12 లక్షల తో పల్లె ప్రకృతి వనం, మన ఊరు, మన బడి కింద ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు రూ.48 లక్షల 86 వేలతో అదనపు సదుపాయాలకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని వివిధ డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.8 కోట్ల 47 లక్షల బ్యాంక్ లింకేజ్ కింద చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు స్వ శక్తి తో ఉండే గ్రామాలు కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఆగమాగం అయ్యాయన్నారు.గ్రామాలలో పనులు లేక ప్రజలు పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఉండేది.సీఎం కేసీఆర్ వచ్చాక పల్లెలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ బిందు జిల్లా కలెక్టర్ శశాంక్, ఈజీఎస్ డైరెక్టర్ వెంకట నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.