హైదరాబాద్, మార్చి 15: (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుతం బదిలీల పర్వంతో సతమతమవుతున్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నలుగురు అధికారులు మాత్రమే ఈ శాఖ కీలక బాధ్యతల్లో ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలోనే ఐదుగురు కమిషనర్లను మార్చింది. బీఆర్ఎస్ పాలనలో 2014-2023 వరకు హీరాలాల్ సమారియా, అనిల్కుమార్, నీతూప్రసాద్, డాక్టర్ టీకే శ్రీదేవి కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో అనిల్కుమార్ ఐదేండ్ల సుదీర్ఘకాలం, నీతూప్రసాద్ మూ డేండ్ల్లకుపైగా ఈ శాఖలో కొనసాగారు. తద్వారా పన్నుల వసూళ్లు, యంత్రాంగంపై పట్టు సాధించే అవకాశం వారికి లభించింది. పన్నుల ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందింది.
రేవంత్రెడ్డి పాలనలో గడిచిన రెండేండ్ల కాలంలోనే నలుగురు అధికారులు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కుర్చీలో కూర్చుని వెళ్లిపోయారు. డాక్టర్ టీకే శ్రీదేవి, డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, ఎస్ఏఎం రిజ్వీ, కే హరిత ఇప్పటివరకు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరంతా కనిష్ఠంగా రెండు నెలల నుంచి గరిష్ఠంగా ఏడు నెలలకాలం మాత్రమే పనిచేశారు. ప్రస్తుతం ఎం రఘునందన్రావు కమిషనర్ కొనసాగుతున్నారు. శాఖాపరమైన లోటుపాట్లు, పన్ను ఎగవేతదారులు, వసూళ్ల విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఒక అధికారికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.
కానీ, పట్టు చికకముందే అధికారులను బదిలీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజ్వీ వంటి అధికారులు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహించినా, వారిని కూడా త్వరగానే మార్చేశారు. రాష్ట్ర మొత్తం పన్ను రాబడిలో 65 శాతానికిపైగా వా టాను అందించే ఈ శాఖలో ఇటువంటి అస్థిరత చోటుచేసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మం చిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
