Namaste Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇరు రాష్ర్టాల మధ్య నీటివాటాలకు సంబంధించి ట్రిబ్యునల్-1 ప్రకారం అనాటికి ఉన్న నీటి వినియోగాలను పరిగణలోకి తీసుకుని ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలని తేల్చి, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ప్రతిపాదించి పునర్విభజన చట్టంలో చేర్చారని ‘నమస్తే’ గుర్తు చేసింది.
ఆ మేరకు 2015లో నిర్వహించిన సమావేశంలో ఇరు రాష్ర్టాలకు నీటి పంపకాలు జరిగాయని, అదికూడా ఏడాది కాలపరిమితితో తాత్కలిక ఒప్పందం మాత్రమేనని, అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుందని ఎలా అంటారని సీఎంను ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు రేవంత్రెడ్డి సూటిగా సమాధానం ఇవ్వకుండా జవాబులు దాటవేశారు.
పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులను అప్పగించాల్సి ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ‘గత సమావేశం మినిట్స్లో అది ఎక్కడ ఉంది?’ అని ప్రశ్న అడిగిన పాత్రికేయుడిని దబాయించారు. ‘నీ పేరేంటి? ఏ పత్రిక’ అని ప్రశ్నించారు. ‘నమస్తే తెలంగాణ’ అని చెప్పగానే ‘అదీ సంగతి. అదొక్కటి చాలు ఏం సమాధానం చెప్పాలనేది. మేనేజ్మెంట్ను బట్టి వాదన ఉంటుంది’ అని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.