హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పొందిన పాస్పోర్టులను వెంటనే రద్దు చేయాలంటూ రీజినల్ కార్యాలయ అధికారికి సీఐడీ లేఖ రాసింది. అలా పాస్పోర్టులు పొందిన 92 మంది వివరాలను సైతం అధికారులకు పంపినట్టు తెలిసింది. నకిలీ ధ్రువీకరణలతో పాస్పోర్టులు పొందినవారిలో కొందరు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా, మిగతావారు దేశం దాటకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది.
ఈ విషయమై ఇప్పటికే విదేశాంగశాఖకు సమాచారం ఇచ్చి ఇంటర్ పోల్ సాయం కోరినట్టు సమాచారం. పాస్పోర్టు కోసం ఇచ్చిన ఫొటోలు, వేలిముద్రను మ్యాచ్ చేస్తూ మరింత సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఏఐ సాయంతో మెరుగుపరిచిన ఫొటోలను ఇంటర్పోల్కు పంపి ఆయా దేశాల్లో విచారణ జరిపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ‘నకిలీ’ వ్యవహారం సంచలనం రేపడంతో వివరాలు బయట పడకుండా సీఐడీ జాగ్రత్తలు తీసుకుంటూ రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నది.