హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై రూ.44 కోట్లతో నిర్మించనున్న లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి దొరికింది. దీంతో ఖానాపూర్ నియోజకవర్గంలో 2900 ఎకరాలకు సాగునీటి వసతి అందుబాటులోకి రా నున్నది.
సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీ శాఖ నిబంధనల మేరకు వైల్డ్లైఫ్ బోర్డు ద్వారా అనుమతులు సాధించింది. 3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. దీంతో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, వెడల్పునకు సంబంధించిన 11 ప్రతిపాదనలు, 5 పంచాయతీ రాజ్ రోడ్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో విద్యుత్లైన్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు (ఈవో), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ఈఆర్వో) నియమిస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లను జిల్లా ఎన్నికల అధికారులుగా, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా నియమించింది. వారంక్రితమే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.