ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కు తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి అందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.6,259 కోట్లు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఇచ్చింది రూ.2,085 కోట్లు. తెలంగాణకు ఇచ్చింది రూ.1,811 కోట్లు. కేంద్రం నుంచి తెలంగాణ కంటే ఉత్తరప్రదేశ్కు రూ.4,448 కోట్లు, గుజరాత్కు రూ.274 కోట్లు ఎక్కువగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందింది. బడ్జెట్ అంచనాల్లో ఉత్తరప్రదేశ్కు 6.19%, గుజరాత్కు 12.80% అందగా.. తెలంగాణకు అందినది 4.39 శాతమే. ఇది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తొలి త్రైమాసిక నివేదికలో వెల్లడించిన కఠోర వాస్తవం.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం ఆర్థిక వివక్ష ప్రదర్శిస్తున్నది. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా వరకు ప్రతి విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రతిసారీ ఈ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల లెక తప్పుతూనే ఉన్నది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను కాగ్ తొలి త్రైమాసిక నివేదిక కండ్లకు కట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ.41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుందని రాష్ట్రం అంచనా వేసింది.
కానీ తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి అందిన గ్రాంట్ రూ.1,811 కోట్లు మాత్రమే. మొదటి త్రైమాసికం వరకు బడ్జెట్ అంచనాల్లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ 4.39 శాతమే. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన గ్రాంట్ మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ ఇలాగే కొనసాగితే… ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ 25 శాతానికి మించకపోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 41,001 కోట్లు వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా రూ.13,179 కోట్లు మాత్రమే అందింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 32 శాత మే. కేంద్రం తీరును పరిశీలిస్తే.. గత సంవత్సరం కంటే ఈ ఏడాది తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ రాష్ర్టాలకు పెద్దపీట
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్తో పోలిస్తే తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.4,448 కోట్లు తక్కువగా వచ్చింది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్తో పోలిస్తే రూ.274 కోట్లు తక్కువగా విడుదలైంది. బీజేపీ రాష్ర్టాలైన అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మణిపూర్, సిక్కింకి సంబంధించిన వివరాలు కాగ్ నివేదికలో లేనేలేవు. మిగిలిన అన్ని రాష్ర్టాలకు సంబంధించిన ఆర్థిక వివరాలు కాగ్ నివేదికలో ఉండగా.. ఆ నాలుగు రాష్ర్టాల వివరాలే ఎందుకు లేవన్నది బ్రహ్మ రహస్యంగా మారింది.
మన కంటే కాంగ్రెస్ రాష్ర్టాలకూ ఎక్కువే
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణతో పోలిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకూ ఎక్కువే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నది. తొలి త్రైమాసికంలో రాజస్థాన్కు రూ.3,671 కోట్లు, హిమాచల్ప్రదేశ్కు రూ.2,854 కోట్లు ఇచ్చింది. తెలంగాణ కంటే రాజస్థాన్కు రూ.1,860 కోట్లు, హిమాచల్ప్రదేశ్కు రూ.1,043 కోట్లు ఎక్కువగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ విడుదల చేసింది. బడ్జెట్ అంచనాల్లో రాజస్థాన్కు 10.80%, హిమాచల్ప్రదేశ్కు 21.88% గ్రాంట్ విడుదల చేసింది. బడ్టెట్ అంచనాల్లో తొలి త్రైమాసికంలో తెలంగాణకు వచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్తో పోలిస్తే రాజస్థాన్కు 6.41%, హిమాచల్ప్రదేశ్కు 17.49% అధికంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చింది.