హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విషం కక్కింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రం నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదన అందలేదని చెప్పింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశం ఉన్నదని తెలిపింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారం వద్ద 380 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
ఈ విషయంపై అనేక ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినా కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. గత పార్లమెంట్ సమావేశాల ఎజెండాలోనే తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ బిల్లు ప్రతిపాదన ఉన్నా.. కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.