హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇచ్చే అంశంపై ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలే నోటికొచ్చిన అబద్ధాలు చెప్పగా, ఇప్పుడు వారితో రాష్ట్ర గవర్నర్ కూడా జత కలిశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేస్తే నిజంగా మారుతుందన్న సిద్ధాంతాన్ని బీజేపీ మొదటి నుంచీ ఆచరిస్తున్నది. ఈ గోబెల్స్ ప్రచార అస్ర్తాన్ని ఇప్పుడు తెలంగాణ మెడికల్ కాలేజీలపై ప్రయోగిస్తున్నది. ఈ దుష్ట రాజకీయ పాచికలో తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా చేరారు. కొన్నాళ్లుగా గవర్నర్ననే విషయం మరిచిపోయినట్టుగా.. ఫక్తు రాజకీయ నాయకురాలిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆమె, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పి నవ్వులపాలయ్యారు. గవర్నర్కు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధారాలతో సహా గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు సైతం తమిళిసైపై ఫైర్ అయ్యారు.
కేరళలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రశంసిస్తూ తమిళిసై ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ ‘తెలంగాణకు కేంద్రం ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చింది?’ అని ప్రశ్నించారు. దీనికి గవర్నర్ స్పందిస్తూ.. ‘దేశంలోని అన్ని రాష్ర్టాలు మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ మాత్రం ఫెయిల్ అయ్యిందంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టంగా చెప్పారు. మీరు ఆలస్యంగా నిద్రలేచి కావాలని అడిగితే ఎలా? తమిళనాడు ఒకే ఏడాది 11 మెడికల్ కాలేజీలు సాధించుకున్నది కదా’ అని గవర్నర్ ట్వీట్ చేశారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. ఇందులో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నది సుస్పష్టం. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ రాష్ర్టానికి అన్యాయం జరిగిందని దేశం మొత్తానికి తెలుసు. కానీ ఈ తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో కేంద్రం, మంత్రులు, గవర్నర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఒక బ్యాచ్ దరఖాస్తు చేసుకొన్నారని.. మరో బ్యాచ్ దరఖాస్తు చేసుకోలేదని చెప్తున్నారు. గవర్నర్ ఈ రెండు వైపులా ఉండటం మరో విశేషం.
గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తప్పుడు సమాచారంతో రాష్ర్టాన్ని బద్నాం చేసే బదులు విభజన చట్టం ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివాటిపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒకటంటే ఒక కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది.
ఒకటో ఫేస్ , రెండో ఫేస్లో ఇవ్వలేదు, మూడో ఫేస్లో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్ష ప్రదర్శించింది. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒకో మంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ అడిగిందనీ, అకడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయామని చెప్తారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు? ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
‘కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా రాష్ట్ర సొంత నిధులతో సీఎం కేసీఆర్ 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ -1 గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?’ అని మరో ట్వీట్లో మండిపడ్డారు.
‘గతంలో బీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పి ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకొన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. డిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీలోని మా పీహెచ్సీ స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉన్నది? రూ. 1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018 లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా?’ అని మరో ట్వీట్లో నిలదీశారు.
‘ఈ అన్యాయాల గురించి ఎందుకు ఒకరు కూడా మాట్లాడరు? ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయరు? ఏపీ పునర్ విభజన చట్టం -2014లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారు అవుతారు’ అని హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ర్టాలకు మంజూరు చేసిన కాలేజీలను గమనిస్తే తెలంగాణకు ఉద్దేశ పూర్వకంగానే అన్యాయం చేసినట్టు స్పష్టమ వుతున్నది. ఇందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశే ప్రత్యక్ష ఉదాహరణ. సీఎస్ఎస్ మూడో దశ కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ 2020 మార్చిలో ఆదేశాలిచ్చింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ 2021 డిసెంబర్ 15న రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏపీలో పాడేరు (విశాఖపట్నం), పిడిగురాళ్ల (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా)లో సీఎస్ఎస్ కింద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నచోట సీఎస్ఎస్ కాలేజీలు ఇవ్వకూడదని కేంద్ర నిబంధనల్లో ఉన్నది. తెలంగాణ ప్రతిపాదనలను సైతం కేంద్రం ఈ నిబంధన కిందే తిరస్కరించింది. కానీ.. రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పేనాటికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడలేదు. 2022 జనవరి 25న ఏపీ క్యాబినెట్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్ 4వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయి.
గవర్నర్ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. పూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేంద్రం అన్యాయం చేసినా, తెలంగాణ సొంత నిధులతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే.. అవన్నీ కేంద్రమే ఇచ్చిందని ఓ సందర్భంలో గొప్పలు చెప్పుకొని, ఇప్పుడేమో తెలంగాణ దరఖాస్తు చేయలేదంటారా?’ అంటూ నిలదీశారు. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరాలని సూచించారు.
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్రమంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటరు. రెండుచోట్ల అడిగారని ఒకరంటరు. అసలు ప్రతిపాదనే పంపలేదని ఇంకొకరంటరు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు? ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు?
– మంత్రి హరీశ్రావు
‘సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి మొదటి, రెండో దఫాలో తెలంగాణకు మంజూరు చేయలేకపోయాం’
– కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా (2015 నవంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ)
‘ఖమ్మం, కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టు 8న మీరు రాసిన లేఖ అందింది. సీఎస్ఎస్ మొదటి, రెండో దఫాలో తెలంగాణకు కాలేజీలు మంజూరు కాలేదు. ఇటీవల మూడో దఫాకు కేంద్రం ఆమోదం తెలిపింది. మీరు ఈ రెండు కాలేజీల డీపీఆర్లు పంపించండి’
– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ (2019 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ)
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఇందులో 9 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఏర్పాటు చేసింది’
– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (2021 జూలై 31న ట్వీట్)
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆలోచనల మేరకు తెలంగాణకు కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. నాగర్కర్నూల్లో ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీ ఇందులో భాగంగా వచ్చిందే.
– గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (2022 ఏప్రిల్ 25న ట్వీట్)
మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు.
– కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (2022 ఆగస్టు 29న పార్లమెంట్లో)
తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం, కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరింది. కానీ.. అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి కాబట్టి ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయలేదు.
– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (2023 ఫిబ్రవరి 16న ఢిల్లీలో)
దేశంలోని అన్ని రాష్ర్టాలు మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకొంటే తెలంగాణ మాత్రం ఫెయిల్ అయ్యింది.
– గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (2023 మార్చి 5న ట్వీట్)