హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): కేంద్రం ఎన్నికల బృందం ఈ నెల 22న రాష్ర్టానికి రానున్నది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 24 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నది. ఈ ఏడాది చివరన నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్నది.
ఈ పర్యటనలో భాగంగా ఎన్నికల్లో శాంతి భద్రతలు ఇతర అంశాలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ అధికారులు, ఎన్సీబీ, ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర జీఎస్టీ, సీజీఎస్టీ, ఈడీ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, డీఆర్ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులతో బృందం అధికారులు సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ అంజనీకుమార్ కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల బృందానికి సంబంధిత అంశాలను వివరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.