హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, గత ఐదేండ్లుగా అమలులో ఉన్న పథకాన్ని ఎన్నికల నేపథ్యంలో నిలిపివేయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం రైతుబంధుకు అనుమతినిచ్చింది. రైతుబంధు పంపిణీకి అభ్యంతరం లేదంటూ ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అయితే ఇంతలోనే సోమవారం ఒక ప్రకటన జారీచేస్తూ రైతుబంధును నిలిపివేయాలని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారని పేర్కొంటూ రైతుబంధు పంపిణీని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అయితే కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం రైతుబంధు పథకాన్ని నిలిపివేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పంట రుణాలమాఫీ, రైతుబంధు వంటి .. లబ్ధిదారులకు ప్రత్యక్షంగా జరుగుతున్న నగదు పంపిణీ పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేసింది. ఆ మేరకే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నదని సామాజిక మాధ్యమాల్లో పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులే రైతుబంధు ఆపారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా రైతుల కోణంలో ఆలోచించి రైతుబంధుకు పంపిణీకి అనుమతిని పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.
రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం అమలుకు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమచేయడానికి అనుమతి ఇచ్చిన తరువాత నిలిపివేయాలని నిర్ణయించడం సరికాదని తెలిపింది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా రైతుల కోణంలో ఆలోచించి అనుమతిని పునరుద్ధరించాలని కోరింది. ఈ మేరకు బీఆర్కేఆర్ భవన్లో సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ను బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, సీఎల్పీ కార్యదర్శి కే రమేశ్రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు అంశం పార్టీలకు సంబంధించినది కాదని, రైతులకు అందించే సాయమని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
రైతుబంధుకు అనుమతి ఇచ్చి, ఇప్పుడు వెనకు తీసుకోవడంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముందు అనుమతి ఇచ్చి, ఆ తరువాత కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి మాత్రం ఎన్నికల సంఘం అనుమతించిందని గుర్తుచేశారు. దానికి అనుమతించిన ఎన్నికల సంఘం రైతుబంధును ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. రైతుబంధు 2018, మే నెల నుంచి కొనసాగుతున్న పథకమని, దీనిని రాజకీయం చేయడం సహేతుకం కాదని అన్నారు. యాసంగి సాగు మొదలైనందున వారికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఈ నెల 24 నుంచి రైతుబంధు అమలు చేయాలని నిర్ణయించిందని, దీనికి ఎన్నికల సంఘం కూడా అనుమతించిందని గుర్తుచేశారు.
ఇంతలోనే రైతుబంధు నిలిపివేయాలని ఎన్నికల సంఘం సోమవారం ఇచ్చిన ఆదేశాలు తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొన్నట్టుగా మంత్రి హరీశ్రావు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేశవరావు వివరించారు. రైతుబంధును పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు కేవలం ధన్యవాదాలు తెలిపారని అన్నారు. రైతుబంధును నిలిపివేయడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, పంట కాలం నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.
డిసెంబర్ 3 తర్వాత రైతుబంధును అడ్డుకోలేరు. సాగు రంగాన్ని ఆపలేరు. వ్యవసాయరంగాన్ని నిలబెట్టాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధును తెచ్చారు. కోటి 50 లక్షల ఎకరాలకు 11 విడతలుగా రైతుబంధు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ నేతలు పథకాలను తాత్కాలికంగా ఆపగలరేమో, కానీ ప్రజలు ఎన్నుకొనే కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరు.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రైతుబంధు సాయం పంపిణీ నిలిపివేయాలని రెండోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. రైతు బంధు విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు దురదృష్టకరం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే. రైతులకు ఎలాంటి బెంగ అవసరం లేదు. తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు. ఎన్నికల తరువాత యథావిధిగా రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు.
– జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి
బీఆర్ఎస్కు ప్రజల మద్దతు చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. అందుకే రైతు సంక్షేమానికి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం సాయం అమలు చేయకుండా అడ్డుపడ్డారు. కాంగ్రెసోళ్లు సంక్షేమాన్ని వచ్చేనెల 3వ తేదీ వరకే ఆపగలరు. ఆ తరువాత ప్రతి సంక్షేమ పథకం అమలవుతుంది. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధితోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రజా సంక్షేమానికి వినూత్న పథకాలను కేసీఆర్ అందిస్తారనే నమ్మ కం ఉన్నది. అందుకే ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు.
-మహేందర్రెడ్డి, గనులశాఖ మంత్రి
రైతుబంధు, రుణమాఫీ ఆపింది కాంగ్రెస్ పార్టీయే. బీఆర్ఎస్కు ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక పోతున్నరు. కర్ణాటకలో అడ్డగోలు హామీలిచ్చి అమలు సాధ్యం కాక చేతులెత్తేసిన కాంగ్రెస్.. ఇక్కడ మాత్రం అలవికాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నది. ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్కే క్లారిటీ లేదు. అంతా డొంక తిరుగుడు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ఆలోచనే తప్ప వారు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు.
-మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
రైతులంటే కాంగ్రెస్కు మొదటి నుంచి కండ్ల మంటనే. రైతుబంధు డబ్బులు ఎప్పుడో పడాల్సి ఉన్నా.. మొదట్లోనే దానికి కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకున్నది. రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే రైతుబంధును ఎలా ఇస్తుంది? నోటికాడిబుకను దూరం చేసిన కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలి.
– మేడె రాజీవ్సాగర్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్
రైతుబంధు కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుబంధుకు ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వగానే అన్నదాతలు ఎంతో ఆనంద పడ్డారు. ఇక పనులు ప్రారంభించుకోవచ్చని ఆశ పడ్డారు. కానీ, రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ వాళ్లకు నచ్చలేదు. రైతులు బీఆర్ఎస్ పక్షాన ఉంటారేమో అని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీకి రైతుల శాపం తగలక మానదు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు