హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి దశలోనే స్టార్టప్లుగా ఎదిగేందుకు కేంద్ర విద్యాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తున్నది. పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ‘ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ ఆటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) 2023 -24’ పేరుతో కొత్త స్కీంను ప్రకటించింది. పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిశోధక విద్యార్థులకు రూ.50వేల ప్రోత్సాహక గ్రాంట్స్ ఇస్తామని వెల్లడించింది. ఇందుకు స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20 వరకు తుది గడువుగా నిర్ణయించారు.
సెప్టెంబర్ 25న దరఖాస్తుల పరిశీలన, 30న ప్రాజెక్టుల ఎంపిక, అక్టోబర్ 5న ఫలితాలు, అక్టోబర్ 10న ప్రాజెక్టు, ప్రాజెక్టు ముగింపు వచ్చే ఏడాది అక్టోబర్ 9గా నిర్ణయించారు. ఇందుకు విద్యార్థుల వయసు 14 నుంచి 16 ఏండ్లుండి, తొమ్మిదో తరగతి నుంచి 11వ తరగతి చదువుతుండాలి. అన్ని రకాల, అన్ని యాజమాన్యాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక పాఠశాల నుంచి ఒక్క ఎంట్రీనే అనుమతిస్తారు. విద్యార్థులు ఏయే రంగంలో పరిశోధన చేస్తే ఆయా రంగాల నిపుణులు మార్గదర్శనం చేస్తారు.