హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ పథకానికి మంగళం పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ఉపాధిహామీకి బడ్జెట్లో నిధుల కోత పెడుతున్న కేంద్రం తాజాగా పనిదినాల మంజూరీలోనూ గణనీయంగా కోత పెట్టింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా అతి తక్కువ పనిదినాలను వచ్చే సంవత్సరానికి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రంలోని ఉపాధిహామీ కమిటీ నిర్ణయం తీసుకొని శుక్రవారం రాష్ట్రానికి సమాచారం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 7 కోట్ల పనిదినాలను మంజూరు చేసింది. గత ఐదు సంవత్సరాల్లో కనీసం 10 కోట్ల పనిదినాలను మంజూరు చేసిన కేంద్రం వచ్చే సంవత్సరానికి మాత్రం 7 కోట్ల పనిదినాలే మంజూరు చేయటంతో రాబోయే రోజుల్లో ఈ పథకానికి మంగళం పాడబోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఉపాధిహామీ పథకానికి అనేక రకాల అంక్షలు విధిస్తూ కూలీలు ఉపాధి పనులు అంటేనే భయపడే విధంగా చేస్తున్నది. ఉపాధిహామీ పథకాన్ని కూలీలకు పనికల్పించడంతో పాటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు 11.33 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరానికి 12 కోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. రాష్ట్రం కోరిన పనిదినాల్లో 40 శాతం పనిదినాలను మొదట్లోనే కోత పెట్టారు. దీంతో కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.