హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): టీం ఇండియా స్ఫూర్తితో పనిచేస్తున్నామని నిత్యం పలవరించే ప్రధాని, రాష్ర్టాల అధికారాలను లాగేసుకోవటానికి తహతహలాడుతున్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పటికీ పలు కీలక నిర్ణయాల్లో పెత్తనం చెలాయించేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఎవరు నష్టపోతున్నారు? అన్న సోయి లేకుండా మోదీ సర్కారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా పత్తి రైతుపై కేంద్రం నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి విత్తనాల ధరల నిర్ణయాధికారం 2015కు ముందు రాష్ర్టాల పరిధిలోనే ఉండేది.
ఎరువులు, పురుగుమందుల ధరల నియంత్రణ రాష్ర్టాల చేతిలోనే ఉండేది. కానీ కేంద్రం పత్తి విత్తన ధరల నిర్ణయంపై పెత్తనం కోసం 2015లో కాటన్ సీడ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ తీసుకొచ్చి రాష్ర్టాల హక్కులను లాగేసుకొన్నది. నాటి నుంచి ఏటా కేంద్ర వ్యవసాయశాఖనే విత్తన ధరలను నిర్ణయిస్తున్నది. ఎరువుల ధరలపై పెత్తనం కోసం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీం పేరిట (ఎన్బీఎస్) ఓ పథకం తెచ్చింది. అక్కడితో ఆగకుండా ఫర్టిలైజర్స్పై ఏకంగా 18 శాతం జీఎస్టీ వేసి రైతు నడ్డి విరుస్తున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా 2023-24 సీజన్కు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల ధరను మరో రూ.43 పెంచింది. దీంతో నిరుడు రూ.810 ఉన్న పత్తి విత్తన ప్యాకెట్ ధర ఈ ఏడాది రూ.853కు పెరిగింది. గత నాలుగేండ్లలోనే పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.123 పెరగటం గమనార్హం.
2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. ఈ ఏడాది ఇంచుమించు అంతేస్థాయిలో పత్తి సాగు కావొచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఆ లెక్కన మొత్తం 1.40 కోట్ల ప్యాకెట్లు అవసరమవుతా యి. ఒక్కో ప్యాకెట్పై రూ.43 పెంచటంతో మొత్తం రాష్ట్ర రైతాంగంపై దాదాపు రూ.60 కోట్ల మేరకు ఆర్థిక భారం పడనున్నది. కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలకెత్తకపోవడం, మురిగిపోవటం, పక్షులు, కీటకాలు వాటిని విచ్ఛిన్నం చేయటంతో మరిన్ని ప్యాకెట్లు అవసరమవుతాయి. అప్పు డు ఈ భారం పెరుగనున్నది.
మరోవైపు పురుగుమందుల ధరలను పెంచుతూ కేంద్రం మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నది. పురుగు మందుల తయారీకి వినియోగించే ముడిపదార్థాలపై దిగుమతుల సుంకాన్ని పెంచింది. జీఎస్టీని విధిస్తున్నది. ఆ మొత్తాన్ని సాకుగా చూపుతూ కంపెనీలు అమాంతం పురుగు మందుల ధరలను పెంచుతుండగా, ఆ మొత్తం విక్రయధరపై కేంద్రం 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నది. వెరసి ఎటొచ్చినా రైతు జేబు గుల్లగా మారుతున్నది.
విత్తన, ఎరువుల ధరలను ఎడాపెడా పెంచేందుకు ఉత్సాహం చూపుతున్న కేంద్రం.. పత్తికి గిట్టుబాటు ధర కల్పించే విషయమై మౌనం వహిస్తున్నదని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెరుగుతున్న ధరల ఫలితంగా పత్తిసాగు పెట్టుబడి రెండింతలవుతున్నదని వాపోతున్నారు. మరోవైపు ఏటికేడు ఎకరాకు వచ్చే పత్తి దిగుబడి తగ్గిపోతున్నది. గత ఏడాది ఎకరానికి 6 క్వింటాళ్లకు మించి రాలేదని చెప్తున్నారు. పత్తికి ధరలు పడిపోతున్న క్రమంలో గతంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రంగప్రవేశం చేసి పత్తిని కొనుగోలు చేసేది. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు రానిస్థితిలో పత్తి కొనుగోలుకు సీసీఐ ముందుకు రావటం లేదు. సీసీఐకి కేంద్రం నిధులు కేటాయించకపోవటమే ఇందు కు కారణం. ఈ ఏడాది బడ్జెట్లో సీసీఐకి కేవలం రూ.లక్ష కేటాయించిందంటే ఎంత టి దుర్భర పరిస్థితి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చు. సీసీఐ అచేతనంగా మారటంతో దళారులు, వ్యాపారులు ఇష్టారీతిన పత్తిని మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
సాధారణంగా బీటీ పత్తి విత్తనాలను సృష్టించిన సీడ్ కంపెనీలకు గతంలో కేంద్రం రాయల్టీ చెల్లించాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో విత్తన ప్యాకెట్ ధరలు పెంచాల్సి వచ్చేది. ప్రతి ప్యాకెట్ ధరలో కొంత మొత్తం రాయల్టీ రూపంలో సదరు కంపెనీకి కేంద్రం చెల్లించేది. విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన మొదట్లో ఈ రాయల్టీ పెద్దమొత్తంలో ఉంటుండగా, సంవత్సరాలు గడిచేకొద్దీ క్రమంగా తగ్గుతున్నది. అది కూడా నిర్ణీత ఒప్పందకాలం వరకే రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిరుటి వరకు బీజీ 2 రకం పత్తి విత్తనాలను ఆవిష్కరించిన సీడ్మనీ కంపెనీకి రాయల్టీ చెల్లించారు. ఈ ఏడాది నుంచి ఆ రాయల్టీ కూడా చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ప్రతి ప్యాకెట్పై రూ.43 పెంచటంతో రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పెంచుతున్నారంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు.