HomeTelanganaThe Brs Mlas Warned That If The Mlas Who Defected From The Party Did Not Resign They Would Be Beaten To In Front Of Their Homes
పార్టీ మారితే చావుడప్పు కొడతాం
పార్టీ ఫిరాయించిన ఎమెల్యేలు రాజీనామా చేయకపోతే వారి ఇండ్లముందు ధర్నాలు చేస్తామని, చావుడప్పులు కొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే
దానం, కడియం, తెల్లంపై వేటు వేయాల్సిందే
వారిపై ఫిర్యాదు చేస్తామంటే స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమెల్యేలు రాజీనామా చేయకపోతే వారి ఇండ్లముందు ధర్నాలు చేస్తామని, చావుడప్పులు కొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ‘పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో ఉరికించి కొట్టాలి. నడిబజారులో ఉరితీయాలి’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉండాలని సవాల్ చేశారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి, కోవ లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. కేపీ వివేకానంద మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరేందుకు తమకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో లీగల్ టీమ్తో సంప్రదించి, రిజిస్టర్ పోస్టులోనూ, మెయిల్ ద్వారా స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ పంపించినట్టు వెల్లడించారు. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరినట్టు తెలిపారు. అనర్హతల పిటిషన్లపై మూడు నెల్లలో సరైన నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా జత చేశామని చెప్పారు. హిమాచల్ప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు రాజకీయ రంగు పులుమితే ఎక్కడికక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తామని, వెనకడుగు వేయబోమని హెచ్చరించారు.
ఫిరాయింపుదారులకు డిపాజిట్లు దక్కవు
దానం నాగేందర్ పార్టీ మారిన అంశంపై మార్చి 18న స్పీకర్కు ఫిర్యాదు చేశామని, ఆయన ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. ఆ కేసు వచ్చే సోమవారం వాదనకు వస్తుందని, దానం నాగేందర్తోపాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పిటిషన్ తీసుకునేందుకు స్పీకర్ కార్యాలయం భయపడుతున్నదని పేర్కొన్నారు. పార్టీ మారినోళ్లకు సిగ్గు, శరం ఉంటే, మొగొళ్లే అయితే, దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి, మళ్లీ పోటీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఫిరాయింపుదారులకు డిపాజిట్లు కూడా రాకుండా అడ్డుకుంటామని చెప్పారు.
నాపై తప్పుడు ప్రచారం: కోవలక్ష్మి
ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘మేము అడవి బిడ్డలం. మాట మీద ఉంటాం. కేసీఆర్ సార్తోనే ఉంటాం. ప్రజా సమస్యల మీద కచ్చితంగా పోరాడతాం’ అని చెప్పారు. ప్రజల సమస్యలు విన్నవించేందుకు మంత్రులు, ఇన్చార్జి మంత్రులను కలిస్తే పార్టీలు మారుతున్నారని ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని, మీడియా కూడా జాగ్రత్తగా వార్తలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, శశిధర్రెడ్డి పాల్గొన్నారు.