ఎగవేసిన హామీలు వెంటాడుతున్నాయి. గాలిపోగేసి చెప్పిన గ్యారెంటీలు గారడీ అని తేలిపోయాయి. ఎలాగైనా అధికారమే లక్ష్యంగా అడ్డగోలుగా కురిపించిన హామీలు.. పచ్చి మోసమేనని తేటతెల్లమైంది. ఎగవేసిన ఒక్కో హామీ.. నైలాన్ తాడులా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నది. దగాపడిన ఒక్కో వర్గం దండు కడుతున్నది. గులాబీ జెండా నీడన వారికి అండ దొరుకుతున్నది.
ఎక్కడెక్కడ డిక్లరేషన్లంటూ కాంగ్రెస్ సభలు పెట్టి మాయ చేసిందో.. అక్కడే, ఆ ప్రజాక్షేత్రంలోనే హామీల సంగతేందో తేల్చుకుంటున్నది బీఆర్ఎస్. వరంగల్లో ఇటీవల రైతు సంగ్రామ సదస్సు పెట్టిన గులాబీ పార్టీ.. నేడు హైదరాబాద్లోని సరూర్నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మబలికి, నిరుద్యోగులను పావులుగా వాడుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు వారినీ వంచిస్తున్నది. జాబ్ నోటిఫికేషన్లు రాక నైరాశ్యంలో మునిగిన నిరుద్యోగులు నిరసనలకు దిగుతున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు పేరిట సర్కార్పై సమరశంఖం పూరిస్తున్నది.
హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎండగట్టేందుకు సమాయత్తమైంది. నిరుద్యోగ యువతకు మొదటినుంచీ వెన్నుదన్నుగా ఉన్న గులాబీ పార్టీ.. అటు చట్టసభల్లో ఇటు ప్రజాక్షేత్రంలో గళమెత్తుతూ వస్తున్నది. అంతేగాక రేవంత్ ప్రభుత్వ అణచివేతలు, నిర్బంధాలను ఎదిరిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా అనేకమార్లు నిరసనలు చేపట్టింది. నిరుద్యోగ యువతతో కలిసి ధర్నాలు, ఆందోళనలకు దిగింది.
తాజాగా అదే బాటలో మరోసారి మోసపూరిత సర్కార్ కండ్లు తెరిపించేందుకు శనివారం ఉదయం ‘చలో సరూర్నగర్’ పేరిట యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నది. ఈ సదస్సుకు గులాబీ పార్టీ సర్వం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సుమారు 20వేల మంది తరలిరానున్న నేపథ్యంలో అనేక ఆటంకాలు, ఇబ్బందులను అధిగమించి చకచకా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు కేటీఆర్ పలుమార్లు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, యువనేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించి సదస్సు విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు.
పార్టీ శ్రేణులకు సలహాలు, సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేశారు. అలాగే సభా ప్రాంగణంలో సుమారు 20వేల కుర్చీలను సిద్ధంచేశారు. సభకు వచ్చేవారికి భోజనం, తాగునీరు, ఇతరత్రా వసతులు కల్పించారు. వేదిక వద్ద కేసీఆర్, కేటీఆర్, ఇతర పార్టీ ముఖ్యనేతల చిత్రాలతో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. గులాబీ తోరణాలతో ప్రాంగణాన్ని అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో యువత పెద్దసంఖ్యలో సరూర్నగర్ సభకు స్వచ్ఛందంగా కదిలివస్తున్నారు. సొంత వాహనాలు ఏర్పాటుచేసుకొని, ఖర్చులు భరిస్తూ సదస్సుకు తరలివస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు వరాలు కురిపించింది. ఎన్నికలకు ముందు 2023 మే 9న రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో భారీ సభ నిర్వహించింది. పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలిచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4000 భృతి ఇస్తామని, యువతకు రూ. 5లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు ఇస్తామని ఊదరగొట్టారు. కానీ అధికార పీఠమెక్కినప్పటి నుంచే మోసాల పర్వానికి తెరలేపారు. జాబ్ క్యాలెండర్ మాటే మరిచారు. కేసీఆర్ పాలనలో సుమారు 60వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెడితే.. నియామకపత్రాలు ఇచ్చి అది కాంగ్రెస్ సర్కార్ ఘనతగా చెప్పుకొన్నారు. 65వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డుల ఊసెత్తకుండా పక్కనపడేశారు.
బీఆర్ఎస్ నేతృత్వంలో సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుతంత్రాలకు దిగుతున్నది. శాంతిభద్రతలను సాకుగా చూపుతూ సభ నిర్వహణకు నిరాకరించింది. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి అనుమతులు సాధించడంతో సర్కారు పన్నాగం బెడిసికొట్టింది. ఈ పరిస్థితుల్లో జిల్లాల నుంచి తరలివచ్చే నిరుద్యోగ జేఏసీ నేతలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట బీఆర్ఎస్ నేతలను గృహనిర్భంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దారుల్లో బారికేడ్లు పెట్టి సభకు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఆటంకాలు కల్పించినా యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.