హైదరాబాద్ సిటీబ్యూరో/ కుత్బుల్లాపూర్/జగద్గిరిగుట్ట/జీడిమెట్ల, మే 24(నమస్తే తెలంగాణ): మత్తడులు దుంకిన చెరువులన్నీ నెర్రలు బారాయి. పరుగులు పెట్టిన కాలువలన్నీ మోడుబారాయి. పంటలు పండిన నేలలన్నీ బీడు బారాయి. పసిడి పంటలకు నిలయమైన పల్లెసీమలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వ్యవసాయం ముఖచిత్రమే మారిపోయింది. సాగుకు నీళ్లులేవు.. నీళ్లున్నా విత్తులేదు.. విత్తు ఉన్నా పంటరాదు.. పంట వచ్చినా కొనే దిక్కులేదు..వెరసి వ్యవసాయమే దండుగైంది. తరతరాలుగా నేలను నమ్ముకున్న రైతు బతుకు ఆగమైంది. కన్నతల్లిలాంటి పల్లెను వదిలి పట్నం బాట పట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. నలుగురికీ పట్టెడన్నం పెట్టిన అన్నదాతే హైదరాబాద్ గడ్డమీద అడ్డాకూలీగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది.
నగరంలో ఏ అడ్డా మీద చూసినా..చేతిలో సద్దిబువ్వ..మెడలో తువ్వాలు..తోడుగా ఇంటామెతో రైతు దంపతులే కనిపిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కదిలిస్తే కన్నీళ్లు.. మాట కలిపితే మౌనరాగాలు. బోర్లేసి బొక్కబోర్లపడ్డ బతుకులు. కల్లబొల్లి మాటలతో అన్నదాతలను ఆశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక చేతులు ఎత్తివేయడంతో… ఐదారు నెలలుగా నగరంలో వలసలు పెరిగిపోయాయి. అడ్డా కూలీలుగా మారుతున్న రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోపరిధిలో బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్, ప్రగతినగర్, గండిమైసమ్మ, షాపూర్నగర్, చింతల్, జగద్గిరిగుట్టతో పాటు, నగర వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న బస్తీల్లో నివాసం ఉంటూ రైతు దంపతులు అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో చెల్లించాల్సిన రైతు బంధు రాక, చేసిన అప్పులు తీరక… అప్పులు తీర్చుకునే ఉపాయం కోసం నగర బాట పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ వ్యాప్తంగా సాగు నీటి కష్టాలు రావడంతో… వేసిన బోర్లన్నీ వట్టిపోయి, పంట పొలాలను ఎండబెట్టలేక వ్యవసాయానికి దూరమైతున్నారు. ఇక అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం… ఆరు నెలలు గడుస్తున్నా పంద్రాగస్టు గడువు చెప్పడంతో … బ్యాంకర్ల వేధింపులు ఒకవైపు.. అప్పులోల్ల బాధలు మరోవైపు.. సమాధానం చెప్పుకోలేక.. ముఖాలు చూపించలేక నగరానికి వలస రావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కనీసం ఇక్కడైన ఏదైనా నిర్మాణ పనులు చేసుకుందామంటే… ఎన్నికల హడావుడి కారణంగా నిర్మాణ రంగంలోనూ పనులు కుంటుపడి పని దొరకడమే కష్టంగా మారిందని చెబుతున్నారు.
నాడు పల్లెకు..నేడు పట్నానికి వలసలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి నగరానికి ఉపాధి కోసం వ లసొచ్చే బడుగులు ఎంతో మంది ఉండేవారు. స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత వలసలకు అడ్డుకట్ట వేసేలా కేసీఆర్ పాలనసాగించారు. స్థానికంగానే మెరుగైన తాగు, సాగు నీటి సదుపాయాలు, రైతులకు భరోసానిచ్చేలా బీమా, రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు, మద్దతు ధరతోపాటు, సకాలంలో ధాన్యం కొనుగోళ్లతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నది. పదేండ్ల కాలంలో ఎండిన చేలన్నీ పచ్చని పొలాలుగా మారిపోయాయి. స్థానికంగానే చేతి నిండా పనితో పట్నం నుంచి పల్లెలకు వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మళ్లీ కష్టాలు మొదలయ్యా. అర్ధరాత్రి కరెంటు, సాగునీటి ఇబ్బందులు, జాడలేని రైతు ప్రోత్సాహకాలతో వ్యవసాయమే సంక్షోభంలో పడింది. దీంతో పంటలు సాగు చేయాల్సిన రైతన్నలు కూడా పంట పొలాలను దూరం చేసుకుని పట్నానికి చేరువయ్యారు. అడ్డామీది కూలీలయ్యారు. ఉపాధి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఏడు బోర్లు వేశాం
మాకు రెండెకరాల భూమి ఉంది. నీటి వసతులు లేక ఏడు బోర్లు వేశాం. ఒక్కటి కూడా పడలేదు. కండ్ల ముందట పొలం ఉన్నా..సాగుకు నీటి లేవు. పొట్ట చేత పట్టుకొని వలస వచ్చి రోజువారీ కూలీకి వెళ్తున్నాం. బోర్లు వేసేందుకు మూడు లక్షలు అప్పు తీసుకొచ్చినం. ఇప్పుడు బతుకే భారమై పట్నం వచ్చి అడ్డామీది కూలీలయ్యాం. రోజూ పని దొరికితే నెలంతా కిరాయిలు కట్టుకొని ఖర్చులకు వెళ్లదీసుకుంటున్నాం. చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం.
– స్వరూప, మెదక్(కొంపల్లి లేబర్ అడ్డా)
నీళ్లులేకపోతే బతకడమే కష్టం
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే కాల్వల నీళ్లు వచ్చేది. ఇప్పుడు కాల్వలు ఎండిపోయాయి. నీళ్లు లేవు. ఎకరం భూమిని కౌలుకు చేసుకొని ఊళ్ల ఉండేది. ఇప్పుడు కౌలు పొలానికి సాగు నీరు లేకపోవడంతో పనులు లేక పట్నం వచ్చాం. చాలీచాలని కూలీ డబ్బులతో రోజువారీ ఖర్చులను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రేవంత్రెడ్డి వచ్చి ఆరు గ్యారంటీలు అన్నాడు. కనీసం ఊర్లలో గతంలో వచ్చే కాల్వలకు నీళ్లు తేలేకపోతున్నాడు. ఇలా ఉంటే బతుకడం చాలా కష్టం.
– యాదగిరి,నర్సాపూర్(కొంపల్లి అడ్డా)
బోరు ఎండిపోయింది
మాది జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామం. మాకు 5 ఎకరాల భూమి ఉంది. బోరుబావిలో నీళ్లు లేక వరిపంట ఎండిపోయింది. ఊర్లో ఉపాధిలేక పని కోసం హైదరాబాద్లోని చింతల్కు భార్య, ముగ్గురు పిల్లలతో వలస వచ్చాం. రెండు నెలలుగా చింతల్లోని అడ్డా మీద కూలీగా పని చేసుకుంటున్నా. భార్య కూడా కూలికి పోతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు, కరెంట్ పుష్కలం. పంట కూడా బాగా పండించిన.
– కాయితాలరవి, చింతల్ అడ్డా
రుణమాఫీ కాలేదు.. అప్పులపాలయ్యా
మాది మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచోల గ్రామం. నాకు ఎకరంన్నర భూమి ఉంది. కరెంట్ మునుపటి లెక్క ఉంటలేదు. బోర్ల నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. రుణమాఫీ చేయకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఊర్లో ఉపాధి కరువై కుత్బుల్లాపూర్కు వలస వచ్చాం. భార్య కూడా నాతోపాటు అడ్డాకూలీగా పనిచేస్తోంది. రోజూ పని కూడా దొరకడంలేదు. వచ్చే డబ్బులు కిరాయి, ఖర్చులకే సరిపోతోంది.
– మద్దూరు సాయి, చింతల్ అడ్డా
రోజూ పని దొర్కతలేదు
బాన్సువాడలో నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఇన్నాళ్లూ అక్కడే ఎవుసం చేసుకుంటూ బతికా. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి పెరిగింది. దిగుబడి అంతంతగానే ఉంది. బోర్లలో నీరు లేవు. కరెంట్ సమస్యలతో రెండు పంటలు వేసే పరిస్థితి లేదు. ఎండాకాలంలో పల్లెల్లో పని దొరకదు. అందుకే కుటుంబంతో హైదరాబాద్ వచ్చి అడ్డాకూలీగా మారాము. ఇక్కడ కూడా రోజూ పని దొరకడంలేదు. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే మళ్లీ వ్యవసాయం చేసుకుంటా.
– కాశీరాం, గండిమైసమ్మ అడ్డా
ఊర్ల రాజులెక్క బతికినం
ఊర్లలో వ్యవసాయ పనులు చేసుకుంటూ రాజులెక్క బతికినం. ఇప్పుడు వ్యవసాయ పనులు తగ్గిపోయినయి. నీళ్ల వసతి లేక పంటలు సాగు చేయడం తక్కువైంది. పనులు లేకుండా పోయాయి. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చినం. ఇక్కడ పనులు దొరికితే బుక్కెడు తిండి, బట్టకు సరిపోతుంది. కిరాయిలు కట్టలేక నానా అవస్తలు పడుతున్నాం.
– సాయిరాం, కామారెడ్డి(కొంపల్లి అడ్డా)
కరెంటు, నీళ్లు లేవు
మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడిపల్లి. మాకు మూడు ఎకరాల పొలం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన. ఊర్లో ఇతరుల పొలం పనులకు కూడా వెళ్లేవాడిని. ఇప్పుడు కరెంటు, నీళ్లు సరిపడాలేవు. మూడు నెలల క్రితం హైదరాబాద్కి వచ్చి అడ్డాకూలీగా పని చేసుకుంటున్నా. మా పిల్లలు కంపెనీల్లో పని చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి, వ్యవసాయానికి అండగా ఉండాలి.
– భిక్షపతి, జగద్గిరిగుట్ట అడ్డా