BJP | వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ వరంగల్లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే మాదిరిగా వ్యవహరించింది. ఇన్ని రోజులు పోలీసులు అనుమతులు ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి ఈసారి ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ఎలాగైనా ర్యాలీని పెద్దగా చూపాలనే ప్రయత్నంతో రాష్ట్ర నాయకత్వం మళ్లీ పాత ప్రణాళికలే అమలు చేసింది. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దీనికి నిరుద్యోగ మార్చ్ అని పేరుపెట్టారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ని ఇక్కడ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా, బెయిల్పై బయటికి వచ్చిన విషయం తెల్సిందే. పేరుకు నిరుద్యోగ మార్చి అని ప్రకటించారు గానీ అంతా బీజేపీ నాయకులే ఉన్నారు.
నిరుద్యోగులు ఈ ర్యాలీకి రాకపోగా, సొంత పార్టీ వారు ర్యాలీ వైపు రావడం ఆలస్యం కావడంతో ప్రకటించిన దానికంటే రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. చివరికి బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే నిర్వహించారు. అనుమతి ఇచ్చిన సమయం కంటే ఆరు గంటలు ముందుగానే యూనివర్సిటీ వద్దకు పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా అక్కడి పోలీసులతో, విద్యార్థులతో ఘర్షణకు దిగేందుకు యత్నించారు.
బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో సాయంత్రం వరకు ఇలాంటి ప్రయత్నాలే చేశారు. చివరికి యువకులు లేకుండా ర్యాలీ మొదలైంది. యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్ జంక్షన్ వద్దకు రాగానే కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. పోలీసు కమిషరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో చేసేది లేక ర్యాలీని ముందుకు కదిలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ జంక్షన్లో ప్రసంగించి ర్యాలీ ముగించారు.