నల్లగొండ : బీజేపీ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర నాయకత్వం మూకుమ్మడి రాజకీయ దుష్ప్రచారం చేస్తుండటాన్ని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దొడ్డిదారిన ఎన్నికైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. స్వయంగా గతంలో బిజేపీనే కుంభకోణాలపై చార్జ్ షీట్ వేసిన అస్సాం సీఎం హేమంత్ బిష్వా శర్మలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. నీతి మాలిన అధికారం వెలుగ బెడుతున్న మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలు తెలంగాకు వచ్చి శ్రీరంగ నీతులు వల్లిస్తున్నారని గుత్తా ఎద్దేవా చేశారు.
ఏడేండ్ల మోదీ ప్రభుత్వం 2కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా.. బ్యాంకులను..ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తుందన్నారు. ధరలు పెంచుతూ దేశ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటుదని విమర్శించారు. 317 జీవో స్థానికతపై స్పష్టత నిచ్చి ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా చర్యలు తీసుకునే లక్యంతో ప్రభుత్వం అడుగులేస్తుంటే బీజేపీ ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ చేస్తుందన్నారు.
రెండు ఉప ఎన్నికల్లో గెలిచి వాపును చూసి బలుపుగా భావిస్తున్న బీజేపీ నాయకత్వానికి యూపీ సహా ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవన్నారు. దేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానికి ఎదురుకాని రీతిలో పంజాబ్ లో మోదీకి రైతుల చేతిలో గుణపాఠం ఎదురైనా బీజేపీ తీరు మారడం లేదన్నారు.
ప్రతిపక్షాలపై ఈడీని, సీబీఐని, ఐటీలను ఉసిగొల్పి దాడులు చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తుందన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై పోరాడేందుకు దేశ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నారన్నారు.
వామపక్షాలతో టీఆర్ఎస్ కలిసి పని చేయడాన్ని బీజేపీ విమర్శించడం సరికాదని, గతంలో మహా కూటమిగా వారితో కలిసి టీఆర్ఎస్ పనిచేసిన సంగతి అందరికి తెలిసిందేనని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్ పాల్గొన్నారు.