Heavy Rains | ఇది మహా కుంభవృష్టి. ఇది వరుణుడి రుద్రనర్తన. చరిత్రలో చూడని వానతో తడిసిముద్దయ్యింది తెలంగాణ. గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తత వందలమంది ప్రాణాలను కాపాడింది. వరద పరిస్థితిపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధసన్నద్ధతతో చర్యలు చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా, వరద బాధితులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణను, సహాయ చర్యలను సమీక్షిస్తూనే.. మరోవైపు ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా అధికార యంత్రాంగం కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీఎం కేసీఆర్ వర్షాలు, వరదలపై అధికారులతో మాట్లాడుతూ, తగిన సూచనలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. ప్రతి గంటకూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాలని డీజీపీని ఆదేశించారు. దీంతో ‘స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్’ను ఏర్పాటు చేసి డీజీపీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై పలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్చేసి ఆరా తీశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, కడెం, మిడ్మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు పలు సూచనలు ఇచ్చారు.
వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ శాంతికుమారికి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, కేటీఆర్తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లకు అవసరమైన నిధులు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ స్వయంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలు, కాలువలు, రిజర్వాయర్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.సీఎం ఆదేశాలతో సచివాలయంలో సీఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమన్వయం చేసుకొంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వర్షాలు, వరద పరిస్థితులు, సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులను నియమించారు. వరద సహాయం కోసం 7997950008, 7997959782, 040-23450779 నంబర్లను ఏర్పాటుచేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కూడా కంట్రోల రూంలను ఏర్పాటు చేశారు.