TPCC | హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ): అధిష్ఠానమంటే మర్యాద ఉండదు.. క్రమశిక్షణ అసలే ఉండదు. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతారు. సొంత పార్టీనే దుమ్మెత్తిపోస్తారు.. అయినా వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు.. ఇదీ నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్లో కొంతమంది నేతల తీరు.. వారిపట్ల అధిష్ఠానం వైఖరిని చూసి ఆ పార్టీ కార్యకర్తలకే చిర్రెత్తుకొస్తున్నది. మా పార్టీ అధిష్ఠానం ఇంత బలహీనంగా ఉన్నదా! అన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర, కేంద్ర నాయకత్వాన్ని సొంత పార్టీ శ్రేణులే చీదరించుకొనే పరిస్థితి వచ్చింది. తమ అధిష్ఠానం మరీ ఇంత చేతగాని స్థితిలో ఉన్నదా! అంటూ నిట్టూరుస్తున్నారు. పార్టీని దెబ్బతీసేలా వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నవారిపై పార్టీ పరంగా కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంపై విస్తుపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కావాలనే చర్యలు తీసుకోవడం లేదా? లేదంటే ఆ నేతలను చూసి పార్టీ రాష్ట్ర, కేంద్ర అధిష్ఠానాలు జంకుతున్నాయా? అని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహారంతోపాటు సీనియర్ల వివాదాలను కూడా ఉదాహరణగా చూపుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో బయటపడిన వివాదాల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సంబంధించినవే అధికంగా ఉన్నాయి. రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి నిన్నమొన్న చెరుకు సుధాకర్ను చంపుతామని బెదిరించటం వరకు అనేక వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకొన్నారంటూ తీవ్ర ఆయన గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎన్నికల్లో సొంత పార్టీకి ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించి ఆడియో ఆ మధ్య వైరల్గా మారింది. ఇక ఇటీవల పార్టీలోకి వచ్చిన చెరుకు సుధాకర్ను చంపేందుకు తన వాళ్లు తిరుగుతున్నారంటూ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీటిపై గతంలోనే అధిష్ఠానానికి చాలా ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ ఒక్క అంశంలోనూ కోమటిరెడ్డిపై అధిష్టానం క్రమ శిక్షణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీనిపై పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఒక నేతపై చర్యలు తీసుకోలేని స్థితిలో తమ అధిష్టానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్లో పలువురు నేతలకు ఢిల్లీ అధిష్ఠానం భయపడుతున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డితోపాటు పలువురు సీనియర్లకు అధిష్ఠానం జంకుతున్నదనే చర్చ గాంధీభవన్లో జోరుగా జరుగుతున్నది. పార్టీ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే ముందే నేతలు తన్నుకున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అధిష్ఠానం ఉన్నదని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. రాష్ట్రస్థాయిలో ఇలా ఉంటే జిల్లా స్థాయిలో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నేతలు పార్టీకి దూరమవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎంత వారైనా చర్యలు తీసుకొంటేనే పార్టీకి మంచిదని సూచిస్తున్నారు.