భైంసా, ఫిబ్రవరి 10 : నెలకు 26 రోజులు పనికల్పించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. శనివారం ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శివాజీ బీడీ కంపెనీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దాదాపు 200 మంది మహిళా కార్మికులు మధ్యాహ్న సమయంలో రెండు గంటలపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా బీడీ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత మాట్లాడుతూ.. నెలలో 8 రోజులు మాత్రమే పని కల్పించడంతో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 26 రోజులు పని చూపించాలని, వెయ్యి బీడీలకు సరిపడా మంచి తునికాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాన్ పీఎఫ్ కార్మికులందరికీ పీఎఫ్ నంబరు లేకపోవడం వల్ల వారికి రావాల్సిన సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆవేదన చెందారు. వెంటనే నాన్ పీఎఫ్ కార్మికులందరికీ నూతన పీఎఫ్ కల్పించాలని కోరారు.