వారంతా పోలీసుల భార్యలు.. తమ భర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఊగిపోయిన పెద్దలు ఆ భార్యల భర్తలను గుర్తించి సస్పెండ్ చేసింది. ఇక్కడ హామీని నెరవేర్చాలని కోరడం నేరమా? లేక రాజుల కాలంలో మాదిరిగా నిలదీస్తే శిక్షించినట్టు ఇప్పుడు శిక్షించడమా?
Telangana | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బెటాలియన్ పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకూ దిగజార్చుతుండటంతో తమ భర్తల కన్నీటి విధులను చూడలేక భార్యలే రోడ్లు ఎక్కి ఆందోళనలకు దిగారు. ఇన్నాళ్లూ 15రోజుల వరస డ్యూటీలను చేసుకొని నాలుగు రోజులు ఇంటికెళ్లి, పెండ్లాం బిడ్డల తో బతుకీడ్చుతున్న వారిపై 26 రోజులు కచ్చితంగా డ్యూటీ చేయాలనే కొత్త నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ‘ఒకే పోలీసు వ్యవస్థ’ను తెలంగాణలో అమలు చేస్తామని ప్రగల్బాలు పలికిన నేతలు.. బెటాలియన్ పోలీసులను పెండ్లాం, బిడ్డలకు దూరం చేసేలా 26రోజుల నిబంధన తీసుకొచ్చారు. దీంతో పోలీసుల భార్యలు రగిలిపోతున్నారు. తమ నిరసనను తెలియజేయడానికి రోడ్ల మీదకు వచ్చారు. న్యాయం జరగకపోతదా అని అనుకున్నారు. కానీ ఆ భార్యల భర్తలను గుర్తించి సస్పెండ్ చేశారు. ‘మా గోడు వెల్లబోసుకున్నా.. మమ్మల్ని అరెస్టులు చేసి, మా భర్తలను సస్పెండ్ చేస్తారా?’ అని బాధిత మహిళలు బోరున విలపిస్తున్నారు. అనధికారికంగా 27 మందికిపైగా సస్పెండ్ అయినట్టు సమాచారం.
‘ఏక్ పోలీస్’ హామీ ఏమైంది?
అందరి పోలీసుల్లాగే తమ భర్తలు కూడా పరీక్షలు రాసి, ఫిజికల్ టెస్టుల్లో పాసై, 9 నెలలు కఠోర శిక్షణ తీసుకున్నవారేగా? వాళ్లకెందుకు మిగతా సివిల్, ఏఆర్ పోలీసుల్లాగా ఒకే చోట డ్యూటీలు వేయరు? వాళ్లను కట్టుకున్న పాపానికి మేమేం తప్పు చేశాం? అంటూ బాధిత బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు తిరగాల్సి వస్తుంది. మేము ఎక్కడ ఉండాలి? మా బిడ్డలు ఎక్కడ చదువుకోవాలి? చేసేది పోలీసు ఉద్యోగమైనా ఈ తిరుగుడేంది?’ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ భర్తలను తోటి పోలీసులే జీతగాండ్లలాగా చూస్తున్నారని.. పొద్దున్నే పలుగు, పారలతో గడ్డి పీకిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో సివిల్, ఏఆర్ పోలీసుల మాదిరిగానే బెటాలియన్ పోలీసులకు వారు కోరుకున్న జిల్లాలో కనీసం 3-5 ఏండ్లు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల పిల్లల చదువులకు అంతరాయం లేకుండా ఉంటుందని, ఉద్యోగభారం తగ్గుతుందని చెబుతున్నారు.
గతంలో ఎలా ఉందంటే…?
గతంలో టీజీఎస్పీ బెటాలియన్లలో పనిచేసే సిబ్బందికి 15 రోజులు డ్యూటీ ఉంటే ఎక్కడో మారుమూల స్టేషన్ నుంచి ఇంటి ప్రయాణానికి ఒకరోజు కేటాయించినా 3 రోజులు కుటుంబంతో గడిపే అవకాశం ఉండేది. ప్రస్తుతం 26 రోజులు డ్యూటీ చేసిన తర్వాత నాలుగు రోజులు సెలవు తీసుకోవాలని నిబంధనను కొత్తగా వచ్చిన ఏడీజీ సంజయ్కుమార్ జైన్ తీసుకురావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటామని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 13 బెటాలియన్స్ ఉన్నాయి. ఒక్కో బెటాలియన్లో 1500 మంది చొ ప్పున సిబ్బంది ఉంటారు. జిల్లా హెడ్క్వార్టర్లో కచ్చితంగా 200 మంది పహారా ఉంటారు. మిగిలిన వారిని ఏ బీ సీ డీ ఈ ఎఫ్ జీ కంపెనీలుగా విభజిస్తారు. ఆయా బెటాలియన్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో కనీసం 3 నెలలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. బెటాలియన్ పరిధిలోని అన్ని పీఎస్లకు రోటేట్ అవుతుండాలి. దీనిని మార్చేందుకు కేసీఆర్.. ‘ఏక్ పోలీస్’ను ప్రవేశపెడదామనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 26రోజుల డ్యూటీ విధానాన్ని తీసుకొచ్చింది.