హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుందామని, ఆయనను కలిసి పూలబొకే ఇద్దామని వెళ్లిన ఆటోడ్రైవర్లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారంనాటి గిగ్స్ వర్కర్స్ సమావేశంలో వారికి సీఎం శుభవార్త చెప్పబోతున్నారని ఉదయం నుంచే వార్తలు వ్యాపించాయి. దీంతో వారంతా బొకేలతో సమావేశం జరిగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు వెళ్లారు. అయితే, ఆ సమావేశం ఆటోడ్రైవర్లది కాదని, గిగి వర్కర్స్ది అని చెప్పడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తమ బతుకులతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గిగ్ ఆధ్వర్యంలో ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో తదితర అసంఘటిత కార్మికుల సమస్యలపై సీఎం చర్చించినా, ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోతున్న తమతో సమావేశం ఏర్పాటు చేయకపోవటంపై ఆటోడ్రైవర్ హబీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ వచ్చామని, సీఎంను కలిసి తమ సమస్యలను చెప్తామని అడిగినా పోలీసులు వారిని అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆటోడ్రైవర్లు.. సీఎం రేవంత్రెడ్డి తమకు న్యాయం చేయకపోతే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వారి వద్దకు వచ్చి ఆటోడ్రైవర్ల సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గిగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఉందంటూ మీడియాకు ఆహ్వానం ఉన్నప్పటికీ జర్నలిస్టులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అలాంటప్పుడు తమను ఎందుకు పిలిచారని నిర్వాహకులను జర్నలిస్టులు ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు లైవ్ ఇవ్వడం కోసం ప్రయత్నించగా, వారిని పోలీసులు బారికేట్ల వరకు నెట్టుకొచ్చి బయటకు పంపించారు. తమకు ఆదేశాలు ఇలాగే ఉన్నాయని నోరు పారేసుకున్నారు. సీఎం సమావేశ కవరేజీ కోసం వస్తే లోపలికి అనుమతించకుండా అవమానించారని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జర్నలిస్టులంటే లెక్కలేదని మండిపడ్డారు.