హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): వెట్టిచాకిరి నుంచి 20 మంది బాలలకు విముక్తి లభించింది. ఒడిశా, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తుండగా 10 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను అధికారులు రక్షించారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి మండలం శ్రీరామ్పురంలో ఎస్వీబీ ఇటుక బట్టీల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోని ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్’ సిబ్బంది నిర్వహించిన బాలల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. బాధితుల్లో 13 మంది బాలికలు, ఏడుగురు అబ్బాయిలున్నారు.
పిల్లలను అక్రమంగా తరలించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన చిల్లా నరసింహాన్ని అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన గండాధీర్ నాయక్ పరారీలో ఉన్నాడు. రెస్క్యూ చేసిన చిన్నారులను నల్లగొండ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం నల్లగొండలోనే ఆశ్రయం కల్పించారు. పిల్లలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బందిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయల్ అభినందించారు. రెస్క్యూలో నల్లగొండ లేబర్ డిపార్ట్మెంట్, డబ్ల్యూడీసీడబ్ల్యూడీ, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు, చైల్డ్లైన్ అండ్ ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే ఎన్జీవో సిబ్బంది పాల్గొన్నారు.