హైదరాబాద్, మార్చి 22: రాష్ట్రంలో పేపర్ లీక్పై బీజేపీ నేతల వైఖరి గురివింద నీతిని తలపిస్తున్నది. పేపర్ లీకేజీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. లీక్ చేసింది టీఎస్పీఎస్సీ సిబ్బంది. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వేసింది. నిష్పాక్షిక దర్యాప్తు చేపడుతున్నది. ఇప్పటికే ప్రధాన నిందితుడితో సహా అందరినీ అరెస్ట్ చేసింది. కానీ సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే బీజేపీ పాలనలోని ఉత్తరాఖండ్లో ఏం జరిగింది? అక్కడ లేఖ్పాల్ (జనవరిలో), జేఈ-ఏఈ (గత ఏడాది జూన్లో) పేపర్లు లీక్ అయ్యాయి.
లీక్ చేసింది స్వయంగా బీజేపీ నాయకుడే. పేరు సంజయ్ ధరివాల్. దీనిపై అక్కడి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకేమీ ఆదేశించలేదు. సిట్తోనే దర్యాప్తు చేయిస్తున్నది. మన సిట్ అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేసి, ఇప్పటికే ప్రధాన నిందితుడితో సహా అందరినీ అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లో మాత్రం పేపర్ లీక్ అయ్యి ఇన్ని రోజులు గడిచినా ప్రధాన నిందితుడిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేకపోయారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా ఇతర బీజేపీ నేతల మాదిరిగానే, ధరివాల్ కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతడికి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో చేసేదేమీ లేక తాను లొంగిపోతానంటూ తన లాయర్ ద్వారా కోర్టుకు అభ్యర్థన పెట్టుకున్నాడు. మరి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారు? ఉత్తరాఖండ్కు ఒక నీతి? తెలంగాణకు ఒక నీతా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.