హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని ‘ఆలిండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమితి ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. 1950 వరకు ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను 1950 నుంచి తొలగించారని సమితి ప్రతినిధులు చెప్పారు.
1956లో దళిత సికులకు, 1990లో దళిత బౌద్ధులకు తిరిగి ఎస్సీ హోదా కల్పించారని గుర్తు చేశారు. దీనిని దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు వర్తింపజేయాలని జస్టిస్ రాజేందర్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని కోరుతూ 2009లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమం లో సమితి ప్రతినిధులు షేక్ సత్తార్ సాహెబ్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఇస్లాముద్దీన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ అహ్మద్, మీర్ ఫహద్ అలీ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.