BTech | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు నిండాయి. ఇంకా 16, 296 సీట్లు భర్తీ కావాల్సి ఉన్నది. వీటిలో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 4,959 సీట్లు, సివిల్, మెకానిక్లలో 5,156 సీట్లు, ఇతర కోర్సుల్లో మరో 458 సీట్లు మిగిలాయి.
యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు, ప్రైవేట్ వర్సిటీలలో 289 సీట్లు, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి.అడపాదడపా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే నింపుకొనే అవకాశం ఉన్నది. ఇలా నిండేవి స్వల్పమే. ఇక స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29లోపు ఫీజు చెల్లించి, గడువు తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు టీసీతోపాటు సర్టిఫికెట్లను కూడా కాలేజీల్లో సమర్పించాలని తెలిపారు.