కవాడిగూడ, జనవరి 25: లోక కల్యాణంతోపాటు దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పీఠాధిపతులు యాగాలు చేయ డం అభినందనీయమని, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు నిర్వహించడం హర్షణీయమని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ కొనియాడారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణ ఉత్సవాలు గురువారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహిస్తున్న కోటి ప్రత్యంగిర మహాయాగంలో భాగంగా శ్రీ సరస్వతి బ్రహ్మదేవ కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఇదేరోజు సామూహిక శ్రీలతా పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వారికి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి మెమొంటోలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో రమ్యానంద భారతి, మనిపల్లె శ్రీనివాస్, మోచర్ల శశిభూషణ్ పాల్గొన్నారు.