హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. 365 స్టాళ్లు కొలువుదీరిన ఈ ప్రదర్శనను ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన ప్రముఖ సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో వక్తలు ప్రసంగిస్తూ.. పుస్తక ప్రాధాన్యతను వివరించారు. మనిషిలోని సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పుస్తకంతోనే మనిషి పరిపూర్ణుడవుతాడానని, ఏ ఇంట్లో పుస్తకం ఉంటే ఆ ఇంట్లో ఓ పుణ్యాత్ముడు తోడున్నట్టేనని విఠలాచార్య అన్నారు.
‘దేవుని రాజ్యం నీలోనే ఉంది’ అనే పుస్తకం చదవడం వలన గాంధీజీ మహాత్ముడయ్యాడని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలు మూతపడే స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. 36 ఏండ్ల నుంచి నిరంతరాయంగా ఈ పుస్తక ప్రదర్శన కొనసాగడం గొప్ప విషయమని ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జూ లూరు గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ‘నవ తెలగాణ’ పత్రిక సంపాదకుడు సుధాభాస్కర్, ‘ప్రజా పక్షం’ పత్రిక ఎడిటర్ శ్రీనివాసరెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తదితరులు పాల్గొన్నారు.