పెద్దపల్లి, మార్చి 31(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైంది.. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసింది. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచింది’ అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిప్పులు చెరిగారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రంది లేకుండా పంటలు పండించుకున్న రైతులను కాంగ్రెస్ సర్కార్ అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. రైతుబంధు కోసం కేసీఆర్ సర్కారు దాచిన రూ. 7,500 కోట్లను గుత్తేదారులకిచ్చి రైతులనోట్లో మట్టికొట్టిందని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ప్రారంభమైన 36 గంటల రైతు నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు నిరంజన్రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఖాళీ చేశారని మండిపడ్డారు. 80 పిల్లర్లు ఉన్న బరాజ్లో 3 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తూ కరువును తెచ్చారని విమర్శించారు. రేవంత్ సర్కారు రైతులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ రాకముందు 1.31 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును 2.38 కోట్ల ఎకరాలకు, 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిని 3 కోట్ల టన్నులకు పెంచి దేశంలోనే వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుల మీద పగ ఉంటే తీర్చుకోవాలని, దేశానికి అన్నం పెట్టే రైతులు ఏం పాపం చేశారని నిలదీశారు. ఉన్న పంటలను కాపాడి ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చిన వందరోజుల్లోనే కరువును తెచ్చిందని ఎద్దేవా చేశారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, యాసంగి ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.