హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ బ్లాక్ మెయిలర్, అవకాశవాదని బీఆర్ఎస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య విమర్శించారు. కడియం శ్రీహరి ఫ్యామిలీ నైతికంగా పతనమైందని, రాజకీయ ఊసరవెల్లిలా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరిని వరంగల్లో ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. కడియం కావ్య, శ్రీహరి గురించి ఘోరంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు, తర్వాత కేసీఆర్ వంచన చేరిన శ్రీహరి, ఇప్పుడు కాంగ్రెస్ చంకలో చేరారని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందన్న ఆయన ఇప్పుడు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లారని నిలదీశారు. కాంగ్రెస్లో పది గ్రూపులు తయారయ్యాయని, కడియం పరిస్థితి కూడా కష్టంగా మారిందని చెప్పారు. తనకు వరంగల్ లోక్సభ భాద్యతలు కేసీఆర్ అప్పగించారని చెప్పారు. గతంలో తాను బీఆర్ఎస్కు రాజీనామా చేసినా దానిని కేసీఆర్ ఆమోదించలేదని తెలిపారు.