హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం అప్పులపాలైందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వీసమెత్తు వాస్తవం లేదని మరోసారి రుజువైంది. అప్పుల కట్టడిలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయం (జీఎస్డీపీ)తో పోలిస్తే అతి ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ర్టాలు ఏమిటి? అప్పుల కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానం ఇచ్చారు. 2021 నుంచి 2023 వరకు జీఎస్డీపీలో రాష్ర్టాల అప్పులను వివరించారు.
జీఎస్డీపీలో అప్పుల పరంగా తెలంగాణ కిందినుంచి ఐదో స్థానంలో ఉండగా, జీఎస్డీపీలో అతితక్కువ అప్పులు చేసిన జాబితాలో వరుసగా.. ఒడిశా (15.7 %), మహారాష్ట్ర (19 %), గుజరాత్ (19.5 %), ఛత్తీస్గఢ్ (27.1 %) ఉన్నాయి. 28.2 శాతం అప్పులతో తెలంగాణ ఐదోస్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ 32.6 శాతం అప్పులు చేసింది. జీఎస్డీపీలో అత్యధిక శాతం అప్పులు చేసిన రాష్టాల్లో వరుసగా.. మిజోరం(53.1%), పంజాబ్ (47.6 %), నాగాలాండ్ (44.2 %), మేఘాలయ (42.5 %), రాజస్థాన్ (40.2 %) ఉన్నాయి. చిన్న రాష్ర్టాలను మినహాయి స్తే.. జీఎస్డీపీలో అత్యధిక అప్పులు చేసిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ మొదటిస్థానంలో ఉన్నది.
60 శాతం మించిన కేంద్రం అప్పులు
రాష్ర్టాలకు పరిమితికి మించి రుణాలు తీసుకుంటున్నాయని, అదే జరిగితే దేశం పరిస్థితి శ్రీలంకలా తయారవుతుందంటూ పదేపదే హెచ్చరిస్తున్న కేంద్రమే నిజానికి తలకుమించిన అప్పులు చేస్తున్నది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కానీ, కేంద్రం అప్పులు జీడీపీలో 62 శాతం ఉన్నట్టు కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల లోక్సభకు తెలిపింది. జీడీపీలో కేంద్రం చేసిన అప్పులతో పోలిస్తే, జీఎస్డీపీలో రాష్ర్టాలు చేసిన అప్పులు తక్కువే. తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నా కేంద్రం మాత్రం అనవసరపు విమర్శలు చేస్తూ నిందలు మోపుతున్నది.