హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రైతుల మరణాలను కొందరు ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల మరణాలు తగ్గాయని స్పష్టంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపే కారణమని చెప్పారు. తెలంగాణలో 2017లో రైతు మరణాలుగా నమోదైన సంఖ్య 846 కాగా 2021లో 352 మంది మరణించినట్టు కేంద్రమే ప్రకటించిందని తెలిపారు.
దేశంలో రైతుల మరణాలపై రాజ్యసభలో ఎంపీ నారాయణదాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. రైతుల మరణాలపై పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన సమాధానం చూసైనా రాష్ట్రంలో విపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రైతులు ఏ కారణంతో మరణించినా రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు పరిహారం అందించి ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని స్పష్టంచేశారు.