హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. మేడిగడ్డ బరాజ్ వల్ల సిరోంచ తాలుకా, గడ్చిరోలి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ముంపు, నివారణకు చర్య లు, పరిహారం వివరాలు వెల్లడించాలని ఎంపీ అశోక్ మహదేవ్రావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు.
మేడిగడ్డ బ్యాక్వాటర్ ఎఫెక్ట్ 12 గ్రామాలపై ఉంటుందని, ఇండ్ల్లు ముంపునకు గురికాలేదని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. బరాజ్ పూర్తిస్థాయి లెవల్ వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు 11.92 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ముంపు నివారణకు మహారాష్ట్రలో గోదావరి వెంట 11.60 కిలోమీటర్ల కరకట్టను నిర్మించారని తెలిపారు. ముంపు బాధితులకు 17.17 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మహారాష్ట్ర అధికారులు ప్రతిపాదనలు పంపగా, అదీ చెల్లించారని వివరించారు.