హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ సర్కార్ దుబారా ఖర్చుకు వెనుకాడటం లేదు. అందాల పోటీలు, మెస్సీతో మ్యాచ్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రజల్లో అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంలో భాగంగా చిప్తో కూడిన స్మార్ట్కార్డుల తయారీకి రూ.75కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. జూన్ 2 నుంచి ఈ కార్డులను ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఆర్టీసీ ఇప్పటికే ఈ మొత్తం ఆర్థిక సాయం రూపంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే తొలుత జిల్లాకో మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాష్ట్రంలో 5 లక్షల మందికి రూ.75 కోట్లు ఖర్చు అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2కోట్ల మహిళలకు కార్డులు ఇవ్వాలంటే ఎంత ఖర్చు కావాలనే చర్చ మొదలైంది. ఒక్కో కార్డుకు రూ.1,500 ఖర్చు అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. కమీషన్ల కోసమే కొత్త నాటకానికి సర్కార్ తెరతీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.