సిద్దిపేట, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుమంటే చేతకాదు.. కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటదట. ఎమ్మెల్యేలను కొంటం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం, బుద్ధి చెప్తారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనే పని కాదు’ అంటూ బీజేపీపై ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతన్నల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్లు నిర్మించడం వల్లే నేడు రాష్ట్రంలో కోటి టన్నుల ధాన్యం ఒక సీజన్లోనే పండిస్తూ, దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని చెప్పారు. కొంతమంది హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితం రాలేదని మాట్లాడుతున్నారని, వారు పచ్చని పల్లెల్లో తిరిగితే రైతులే సమాధానం చెప్తారని హితవుపలికారు. ధాన్యం కొన్న మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ప్రభుత్వం నిధులు సమకూర్చిందని వివరించారు.
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. రాజకీయాల కోసం కాదన్నారు. రాష్ట్రంలో 20 వేల వరి కోత యంత్రాలు, సరిపడా కూలీలు ఉన్నా, వరి కోయడానికి రైతులు ఎదురు చూస్తున్నారంటే ఎంత ధాన్యం పండిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తే, రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తామని ఆశ చూపుతున్నదని చెప్పారు. కానీ, పక్క రాష్ర్టాల మాదిరిగా కాకుండా సీఎం కేసీఆర్ వాటిని వదులుకొని 65 లక్షల మంది రైతుల సంక్షేమమే తమకు ముఖ్యమని మీటర్లు పెట్టబోమని స్పష్టంచేశారని తెలిపారు.